మామూలుగా ఎవరైనా మనుషులు తప్పిపోతే వారిని పట్టిస్తే నజరానా ఇస్తామని అనేకమార్లు చూసే ఉంటాం.కాకపోతే, ఇప్పుడు మాత్రం ఓ కోతి ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామంటూ చెప్పడం నిజంగా ఆలోచించదగ్గ విషయం.
అది కూడా ఏకంగా 50 వేల రూపాయలు ప్రకటించింది ఓ సంస్థ.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…. ఈ సంఘటన మొత్తం పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ ఈ ప్రాంతంలో వెలుగుచూసింది.చండీఘడ్ లో ఉంటున్న కమల్ జీత్ సింగ్ అతని మేనేజర్ దీపక్ వోహ్రా కొహెర ఓ కోతిని పెంచుకున్నారు.
మామూలుగా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఏవైనా జంతువులను అక్రమంగా ఇంట్లోనే ఉంచి పెంచుకోవడం చట్టరీత్యా నేరం.దీంతో వారు కోతిని పెంచుకుంటున్న విషయం పోలీసులకు తెలియడంతో వారిద్దరిని వారం రోజుల క్రితం అరెస్టు చేశారు.
అయితే బెయిల్ పై మరుసటి రోజే వారిద్దరు విడుదలయ్యారు.ఇక ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా తాము కోతిని పెంచుకున్న విషయం వాస్తవమేనని… అయితే, అది చట్టరీత్యా నేరం అని తెలిసిన తర్వాత వెంటనే ఆ కోతిని అడవిలో వదిలి పెట్టినట్లు తెలిపారు.
అయితే వారు తెలిపిన విషయం నమ్మే విధంగా లేదంటూ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ యానిమల్స్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఇక ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా కోతిని అడవుల్లో వదిలినట్లుగా సరైన ఆధారాలతో నిరూపించాలని సదరు నిందితులకు సూచిస్తూ కోర్టు తీర్పును వచ్చే నెల 7వ తారీకు వాయిదా వేసింది.
ఇక ఈ విచారణలో నిందితులు చెప్పే మాటల్లో ఎలాంటి స్పష్టత కనపడలేదని అటవీ శాఖ డిప్యూటీ అధికారి అభిప్రాయపడ్డాడు.నిందితులు తమకి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు సమర్పించ లేదని ఆ అధికారి తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన సదరు ఎన్జీవో సంస్థ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే కోతి ఆచూకీ తెలుపుతారో వారికి 50 వేల నజరానా ఇస్తామని ప్రకటించింది.అంతేకాదు సదరు కోతి ఆచూకీ తెలిపిన వారికి వివరాలు గోప్యంగా ఉంచుతామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది.
అయితే ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు సదరు ఎన్జీవో సంస్థ ప్రయత్నాలు చేస్తోందని నిందితులు దీపక్ వోహ్రా, కమల్ జీత్ సింగ్ తెలియజేశారు.