సాధారణంగా ప్రతి ఆలయానికి కొన్ని ప్రత్యేక నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయం తెలిసిందే.అదే విధంగా రాజస్థాన్ రాష్ట్రంలోని కర్ణి మాత ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి.
కర్ణిమాత ఆలయంలో దాదాపు 20 వేల ఎలుకలు ఉన్నాయి.ఈ ఎలుకలు ఆలయ ప్రాంగణంలోనే జీవిస్తాయి.
కబ్బాస్ అనే పేరుతో ఈ ఎలుకలను పిలుస్తారు.ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో ఒకటైన ఈ ఆలయం రాజస్థాన్ లోని బినేకర్ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వేల సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఎలుకలను కూడా పూజిస్తారు.వినడానికి వింతగా అనిపించినా ఈ ఆలయంలో ఎలుకలను నిజంగానే పూజిస్తారు.రాజస్తాన్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కర్ణి మాత ఆలయానికి భక్తులు వస్తారు.ఆలయంలో ఎక్కడ చూసినా కనిపించే ఎలుకలు కాళ్ల కింద పడకుండా నడవాలి.
పొరపాటున ఎవరి కాళ్ల క్రిందైనా పడి ఎలుక మరణిస్తే వారు ఘన బంగారంతో ఎలుక తయారు చేయించాల్సి ఉంటుంది.
ఆలయ నిర్వాహకులు, సిబ్బంది వైర్లు మరియు గ్రిల్స్ ను ఏర్పాటు చేసి ఎలుకలనుఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.ఆలయ పూజారులు, సిబ్బంది ఎలుకలకు ఆహారం అందించడంతో పాటు వాటి విసర్జనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటారు.14వ శతాబ్దానికి చెందిన దుర్గా దేవి ఉపాసకురాలు కర్ణి మాత త్వరలో తన వంశస్థులు చనిపోతారని….వారు ఎలుకలుగా జన్మించి ఆలయంలో తిరుగుతారని… ఆ ఎలుకలను సేవించి ధన్యులు కావాలని చెప్పడంతో అప్పటినుండి భక్తులు ఆలయంలోని ఎలుకలను కూడా పూజిస్తున్నారు.