పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు అందించడం ద్వారా హక్కుదారులను చేస్తున్నామని శాశ్వత ఆస్తి హక్కులను కాపాడుకోవాలని , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు .ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు గురువారం ఇండ్ల పట్టాలను మంత్రి అందజేశారు.
నగరంలోని 4 వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట నివాసితులు 77 మందికి , 58 వ డివిజన్ దొరన్నకాలనీలో 127 మందికి , అదేవిధంగా 31 వ డివిజన్ పత్తి మార్కెట్ ప్రాంతంలోని నివాసితులు 138 మందికి గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇండ్ల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆస్తి హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో నగరంలో పేదలు నివసించే 12 కాలనీలను గుర్తించి సర్వే చేయించడం జరిగిందని , గత ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న పేద ప్రజలకు ఇండ్ల పట్టాలను అందించి హక్కు కల్పించాలనే సంకల్పంతో మహిళ పేరునే పట్టాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు .భవిష్యత్తులో ఇండ్ల స్థలాలు కలిగిన పేద ప్రజలకు ఇండ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనున్నదని , ప్రస్తుతం కల్పించబడిన ఆస్తి హక్కును ఎట్టి పరిస్థితులలో దుర్వినియోగం చేసుకోవద్దని మంత్రి సూచించారు .ఇండ్ల పట్టాలు పొందిన వారందరికి ఆధార్ , ఓటరు ఐడి కార్డుతో శాశ్వత చిరునామాకు గాను మీసేవలో నమోదు చేయించాలని అధికారులకు , స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు .ఇండ్ల పట్టాలు అందించడమే కాకుండా పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో మౌళిక వసతులను ఏర్పాటు చేసామని , తర్గత రోడ్లు ఏర్పాటు చేసుకున్నామని , ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు .జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ , ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న , స్థానిక కార్పోరేటర్ జ్యోతిరెడ్డి , 6 వ డివిజన్ కార్పోరేటర్ నాగండ్ల కోటి , ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాద్ , అర్బన్ తహశీల్దారు శైలజ , నగరపాలక సంస్థ కార్పోరేటర్లు , స్థానిక ప్రజాప్రతినిధులు , తదితరులు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు .