క్యాంప్ కార్యాలయంలోనే నివాసం ఉండనున్న మంత్రిదసరా సందర్భంగా పువ్వాడ సంచలన నిర్ణయం ఖమ్మం నియోజకవర్గ ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ నిత్యం వారికి అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.నగరంలోని వీడీఓస్ కాలనీలోని తన క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి అజయ్ నివాస సముదాయంగా మారుస్తూ ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు నిశ్చయించారు.
క్యాంప్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో దసరా పండుగ నాడు నుంచి ఇక నివాసం ఉండనున్నారు.ఇప్పటి వరకు మమత ఆస్పత్రిలోని విలాసవంతమైన భవనంలో నివాసం ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక ప్రజా వేదిక గా వెలుగొందుతున్న తన క్యాంప్ కార్యాలయంలోనే నివాసాన్ని ఏర్పరచుకొని ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
ఖమ్మం లోని ప్రతి ఒక్కరినీ ఇంటి మనిషిలా చేసుకునేంతటి సుగుణ సంస్కారం, విధి నిర్వహణలో, ప్రజాసేవలో, ఆపన్నులను ఆదుకోవటంలో విసుగూ, విరామం ఎరుగని నిరంతర ప్రజానాయకుడుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీర్తింపబడుతూ ఎంతటి వివాదాస్పద విషయమైనా, రాజకీయ వైరుధ్యాలనైనా తనదైన శైలిలో పదునైన చెణుకులకే పరిమితం చేసే హుందాతనాన్ని సొంతం చేసుకున్నారు.ఎంత క్లిష్టమైన బాధ్యతనైనా తిరుగులేని ఆత్మవిశ్వాసం, మొక్కవోని దీక్షతో అలవోకగా అధిగమించే సాఫల్య చిరునామాగా నిలిచినందున ప్రజా జీవితంలోప్రజానేతగా మంత్రి అజయ్ భాసిల్లుతున్నారు.
ఇప్పుడు తన నివాసాన్ని ప్రజల మధ్యలోకి ప్రజల చెంతకు మార్చిన దృష్ట్యా నియోజకవర్గ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.సామాన్యులకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు.
అందరినీ మెప్పించిన రాజకీయ చతురుడు.అనతికాలంలోనే ఎన్నో ప్రజల మన్ననలు పొందిన మోడర్న్ లీడర్.
దశాబ్ద కాలంలో ఖమ్మం నియోజకవర్గ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయడమే కాదు, తాను చేపట్టిన శాఖలో ఎన్నో విప్లవాత్మక, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆదర్శప్రాయుడు పువ్వాడ అజయ్ కుమార్.
ఇక ప్రజల మధ్య క్యాంప్ కార్యాలయంలోనే నివాసం ఉంటూ గుండెల నిండా ఆత్మ విశ్వాసం, వెంట నడిచే నమ్ముకున్న కార్యకర్తల ఆశావాదం, గురిపెట్టిన బాణంలాంటి వ్యూహం, కాలాన్ని సైతం మార్చగల కర్తవ్యం, మంత్రముగ్ధం చేసే మాట, మాట ఇస్తే తప్పని కమిట్మెంట్, ఏదేమైనా తన ప్రజలకు కించిత్తు హానీ జరగకూడదనే పరిణత, ఉద్దండుల్ని మించిన రాజకీయ చతురతతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సేవను కొనసాగించనున్నారు.