ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.ప్రధానమైన పది బిల్లును పాస్ చేసుకునే కీలక ఉద్దేశంతోనే ఈ సమావేశాలను జరపాల్సి వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయినప్పటికీ పోలవరం సహా అనేక అంశాలపై సభలో ప్రధానంగా చర్చ సాగింది.ఈ క్రమంలో ప్రభుత్వం ఎదురుదాడి టీడీపీ ఆత్మరక్షణ అనే రెండు కీలక అంశాలు స్పష్టంగా కనిపించాయి.
ఇక, వరుసగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం సభపై దృష్టి పెట్టిన వారికి విస్మయం కలిగించింది.
ఇక తొలిరోజు సభలో తమకు మైకు ఇవ్వడం లేదని పేర్కొంటూ టీడీపీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు ఏకంగా సభలో నిరసన తెలపడం, పోడియం మెట్ల వద్ద కూర్చోవడం వంటివి ఈ అసెంబ్లీలో పతాక సన్నివేశంగా నిలిచింది.
మాజీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు ఆయన జీవితంలో తొలిసారి పోడియం వద్దకు రావడమే కాకుండా బైఠాయించడం నిజంగానే ఒక హిస్టరీని క్రియేట్ చేసింది.ఇక దీనికి కొనసాగింపుగా ఎన్నోఏళ్ల సంప్రదాయంగా వస్తున్న ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయరాదనే నియమాన్ని కూడా ఈ అసెంబ్లీ తుడిచి పెట్టేసింది.
తొలి రోజు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేసింది.ఇక, వరుసగా మిగిలిన మూడు రోజులు అంటే మొత్తం నాలుగురోజులు టీడీపీ సభ్యులు సస్పెండ్ అవుతూనే ఉన్నారు.మరి ఇలా ఇప్పుడున్న అసెంబ్లీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఎవరికి లబ్ధి కలిగిస్తుంది ? ఎవరిని ప్రజలలో హీరోలుగా నిలబెడుతుంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి.వీటికి సమాధానం ఒక్కటే ప్రభుత్వ పక్షం అభాసుపాలవుతోంది.
గతంలో తమను సస్పెండ్ చేశారని రోదించిన వైసీపీ సభ్యులు ఇప్పుడు చేస్తోందీ అదే కదా ? అనే ప్రశ్న వస్తోంది.ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా సంయమనం పాటించాలనే సూచనలు వస్తున్నాయి.
గతంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక వివరణ ఇచ్చే సమయంలోనూ.సమాధానం కోరే సమయంలోనూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
మొత్తంగా ఈ పరిణామాలు.ఇరు పక్షాలకు మేలు చేయడం లేదని పరిశీలకులు అంటున్నారు.