కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశం అమెరికాయే.లక్షలాది మరణాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో కేసులు వీటన్నింటికి మించి ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగింది.
దీనంతటికి కారణం చైనీయులు, ఆసియన్లే కారణమనే భావన అమెరికన్లలో బలంగా నాటుకుపోయింది.దీంతో ఆసియా అమెరికన్లను టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్నారు.
గడిచిన రెండు వారాల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి.మంగళవారం మూడు మసాజ్ పార్లర్లలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు.
వీరిలో ఆరుగురు ఆసియన్లే, అందులోనూ మహిళలు కావడం గమనార్హం.మృతుల్లో నలుగురు దక్షిణ కొరియా మహిళలు వున్నారు.
జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలోని రెండు పార్లర్లలో, ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వుడ్స్టాక్లోని మరో పార్లర్లో మంగళవారం సాయంత్రం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న 21 ఏళ్ల రాబర్ట్ ఆరోన్ లాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని కమలా హారీస్ అధికారిక నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఆగంతకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.అతనిని తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు దొరికాయి.
దుండగుడిని టెక్సాస్లోని శాన్ ఆంటోనియోకు చెందిన పాల్ ముర్రేగా గుర్తించారు.అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అమెరికా ఉపాధ్యక్షురాలి ఇంటి వద్ద ఓ వ్యక్తి ఆయుధాలతో పట్టుబడటంతో సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది.
కాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, పాప్ సింగర్ రిహానా వంటి వారు జాత్యహంకార దాడులను ఖండించారు.మన సమాజంలో ఇటువంటి వివక్షకు చోటు లేదు.ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆసియా, ఆసియా సంతతి అమెరికన్లకు సంఘీభావం తెలుపుతున్నా’ అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు.ఈ నేపథ్యంలో విద్వేష దాడులకు చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రంగంలోకి దిగారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం జార్జియాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో ఆసియన్ అమెరికన్ నాయకులతో సమావేశమయ్యారు.జాత్యహంకార ఘటనలకు విరుద్ధంగా అమెరికన్లు గళం విప్పాలని అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ.మనమంతా మౌనంగా ఉంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలని బైడెన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
.