ఓ వైపు కరోనాతో అన్ని రాష్ట్రాలు వణికిపోతూ ఉన్నాయి.అసలు ఈ వైరస్ దాడిని నియంత్రించే ప్రయత్నం కూడా చేయలేక ప్రజలమీదనే భారం వేసేసారు.
భౌతిక దూరం, స్వీయ రక్షణ మాత్రమే కరోనా నుంచి తమని తాము రక్షించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అని వైద్య నిపుణులు, ప్రభుత్వాలు, పోలీసులు పదే పదే సూచనలు చేస్తున్నారు.హెచ్చరిస్తున్నారు.
మాస్కులు పెట్టుకోకుంటే ఫైన్ లు వేసి వాటి ఆవశ్యకత తెలియజేస్తున్నారు.అయిన కాని జనంలో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు.
కరోనా తమకి రాదని అనుకుంటున్నారో, లేక జల్సాలకి అలవాటు పడిన ప్రాణం కుదురుగా ఉండలేకపోయిందో కాని పార్టీలు, పబ్ లు అంటూ సిటీలో కొంత మంది బడా బాబుల పిల్లలు హడావిడి చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రేవ్ పార్టీ జరగడం తీవ్ర కలకలం రేపింది.
రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు.వీరిలో ఒకరు ఉక్రెయిన్ జాతీయురాలు కాగా, ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఓ రేవ్ పార్టీ నిర్వహించి పోలీసులకి చిక్కినట్లు తెలుస్తోంది.నిందితులపై కరోనా నిబంధనల ఉల్లంఘనల కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం.
అలాగే వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం బయటకి రావడంతో కరోనా సమయంలో ఈ కక్కుర్తి ఏంటి అని చర్చించుకుంటున్నారు.