వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ హైకోర్టు వద్ద ఎన్నోసార్లు చివాట్లు పడుతూనే ఉంది.తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రైతుభరోసా కేంద్రాలు, విలేజి క్లినిక్స్, సచివాలయాలను నిర్మించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో వివిధ కార్యాలయాలు నిర్మిస్తున్నారంటూ వైసిపి వారికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లపై గతంలోనే పలుమార్లు హైకోర్టు విచారణ జరిపింది.ఇక దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సహా ఇతర ముఖ్య అధికారులను కోర్టు వివరణ కోరింది.
ఎప్పుడో పాఠశాల స్థలాల్లో నిర్మించిన కార్యాలయాలను తొలగించాలని లేదంటే వాటిని విద్య అవసరాలకు వినియోగించాలని సూచించింది.
అయితే ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో 63 చోట్ల సచివాలయాలు ఆర్పీకెలు నిర్మించారు.57 చోట్ల ఆ భవనాలను పాఠశాలలకే అప్పగించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.వాటిని తరగతి గదులుగా ఇతర అవసరాలకు స్కూళ్లు వాడుకుంటున్నాయని చెప్పారు.
అయితే ఈ వ్యవహారం మొత్తం మూడు శాఖలతో ముడి పడింది కనుక కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యమైందని సిఎస్ క్షమాపణ కోరారు.
అయితే తాజాగా దాఖలైన పిటిషన్ ప్రకారం హైకోర్టు అధికారులకు పలు ప్రశ్నలు సంధించింది.అసలు పాఠశాల ప్రాంగణాల్లో ఇతర కార్యాలయాలు నిర్మించే ముందు తల్లిదండ్రుల కమిటీలతో చర్చించారా.? అని అడిగింది.విద్యార్థులకు అసౌకర్యమని వేరే నిర్మాణాలను చేపట్టొద్దని 2020 జూన్లో ఉత్తర్వులు ఇచ్చినా కూడా వాటిని ఉల్లంఘించినందుకు అవి అక్రమ నిర్మాణాలే అవుతాయి అని హైకోర్టు తేల్చేసింది.ఇక ఇప్పటికీ 239 చోట్ల నిర్మాణాలు వివిధ దశలో జరుగుతున్నాయని వాటి సంగతేందో చెప్పాలని అధికారులను నిలదీసింది.
కేవలం 50, 60 చోట్ల ఆదేశాలను అమలు చేస్తున్నట్లు చూపించినంత మాత్రాన తాము చేస్తున్న అక్రమ కట్టడాలను ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనుకోవద్దని హితవు పలికింది.పేద పిల్లల చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావన అంటూ హై కోర్టు నిలదీసస్తే సిఎస్ వద్ద సమాధానం లేకుండా పోయింది.అబ్దుల్ కలాం, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ వంటి ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని ఇకనైనా వీటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మందలించింది.