నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది.అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో పట్టపగలే వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.6 నెలల కిందే ప్రణయ్కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది.అమె గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్అప్ కోసం శుక్రవారం తీసుకువచ్చాడు.
అయితే భార్యను డాక్టర్కు చూపించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు.ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత షాక్కు గురైంది.దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజెన్స్ మనసును కదిలిస్తుంది.ప్రేమకన్నా కులం గొప్పదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసుకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.యువతి అమృత వర్షిణి వైశ్య (కోమటి) కులానికి చెందినది.యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ (మాల) కులానికి చెందిన వ్యక్తి.
వీళ్లిద్దరూ బీటెక్ నుంచి ప్రేమించుకుంటున్నారు.ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు.అయితే, వర్షిణి మాత్రం ప్రణయ్ని వదలి పెట్టలేదు.
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని హైదరాబాద్ పారిపోయారు.ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకుని మిర్యాలగూడలోనే కాపురం పెట్టారు.
అయితే అప్పటికి అమృత తండ్రి ప్రణయ్ ను ఫోన్ చేసి బెదిరిస్తూనే ఉన్నాడు.తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు ప్రణయ్ వర్షిణిలు .ఐజీ ఆదేశాలతో ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.ఆ తర్వాత వర్షిణి తండ్రి అల్లుడితో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
కానీ అది నటన అని గ్రహించలేకపోయారు అమృత ప్రణయ్ లు.రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు.
కానీ, మారుతీరావు మంచిగా ఉన్నట్టే నటిస్తూ…తన ప్లాన్ అమలు చేసాడు.ఓ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చి అల్లుడి అడ్డు తొలగించాలనుకున్నాడు.పది లక్షల సుపారీ ఇచ్చి మరీ కన్నకూతురు భర్తను హత్య చేయించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పథకం ప్రకారమే కూతురు గర్భవతిగా ఉండగా ఆమె ఎదుటే అల్లుడిని చంపించారు.
అంతేకాదు ఈ కేసులో బయటపడ్డ మరో విషయం ఏంటి అంటే…ప్రణయ్, వర్షిణి ప్రేమించుకున్న విషయం తెలియగానే అమ్మాయి తండ్రి మారుతీరావు వారి ప్రేమను సమాధి చేసేందుకు తన కూతురును మరిచిపోవాలని ప్రణయ్ కి మూడు కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు తెలిసింది.
కానీ ప్రణయ్ అంగీకరించలేదు.మారుతీ ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసిన ప్రణయ్, అమృతను పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపారు.
చివరకు ఇలా కుట్ర చేసాడు ఆ మామ.