రాజకీయాల్లో వ్యూహం అనేది చాలా కీలకం.రాజకీయాల్లో గెలుపు ఓటములు వ్యూహం పైనే ఆధారపడి ఉంటాయి.
అయితే ఆ వ్యూహం రచించడంలో కేసీఆర్ దిట్ట.కేసీఆర్కు రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరుంది.
ఏ టైమ్లో దేన్ని ఉపయోగించాలి, ఎవరి వాడుకోవాలి అనేది కేసీఆర్ కు తెలిసినంత ఎవరికీ తెలియదేమో.ఈ క్రమంలోనే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికలో రాజకీయ లబ్ధికోసమే ‘దళిత బంధు’ ప్రవేశపెట్టినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు.
అయితే, ఇప్పుడు మాత్రం హుజూరాబాద్లో కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.ఇప్పటికే కలెక్టర్ అకౌంట్లో డబ్బులు పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ‘దళిత బంధు’ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఒకప్పటి ఉద్యమస్వరాలను తెరమీదకు తెచ్చారు.వారు ఎవరంటే ప్రజావాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాంస్కృతిక సారథి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
తెలంగాణ ఉద్యమ సమయంలో వీరు ప్రదర్శించన తీరు అద్వితీయం.వీరు పాటలు పడితే స్టేజీ మొత్తం దద్దరిల్లడమే కాకుండా ఉద్యమ భావన నర నరాన ప్రతీ ఒక్కరిలో రగిలిపోయేది.
దాంతో తెలంగాణలో వీరిద్దరు మంచి ఉద్యమ గాయకులుగా పేరు తెచ్చుకున్నారు.తాజాగా వీరితో ‘దళిత బంధు’ కు సంబంధించి పాటలు పాడిస్తున్నట్టు సమాచారం.సీఎం కేసీఆర్ ఈ మేరకు వారికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.మొత్తంగా తెలంగాణలో మళ్లీ ఉద్యమ గానం వినపడనుంది.పాలనలో మార్పు తీసుకువచ్చి, దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.వాసాలమర్రి పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తీసుకెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది.
దాంతో ప్రతి ఒక్కరి మదిలో గోరటి వెంటన్నను ఎలా వాడుకుంటాడో అనే ప్రశ్న మొదలైంది.