బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్ని నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.సుశాంత్ మృతిపై అనేక సందేహాలు నెలకొనగా ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది.
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఈ కేసు విషయంలో అనేక విషయాలను దాస్తోందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
రియా సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చిందని, డ్రగ్స్ డీలర్లతో రియాకు సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియాను విచారిస్తున్నాయి.
అయితే తాజాగా రియా చక్రవర్తి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.విచారణకు సహకరించడానికి తనతో పాటు తన కుటుంబం సిద్ధంగానే ఉన్నా తమను మాత్రం ఎవరూ నమ్మడం లేదని ఆమె పేర్కొంది.
రియా తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను విడుదల చేసి ఆ వీడియోలో కీలక వ్యాఖ్యలు చేసింది.
తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారని… అయితే ఆ సమయంలో కరోనా నిబంధనలు కూడా పాటించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తాను, తన కుటుంబ సభ్యులు దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తున్నప్పటికీ తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆమె చెప్పింది.పోలీసులను, దర్యాప్తు అధికారులను తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నా వారి నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపింది.
విచారణకు వెళ్లే సమయంలోనైనా తమకు రక్షణ కల్పించాలని ముంబై పోలీసులను వేడుకుంటున్నానని ఆమె పేర్కొంది.