భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు కొన్ని నెలలుగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.
అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోయాయి.రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.
దీనికి తోడు రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ట్వీట్ చేసిన ‘‘టూల్ కిట్ ’’ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.నాటి నుంచి ఉద్యమాన్ని అంతగా పట్టించుకోవడం లేదు.
దీనికి తోడు వేసవి కాలం కావడంతో పాటు దేశంలో సెకండ్ వేవ్ విజృంభించడంతో రైతుల ఆందోళనకు సంబంధించిన కథనాలు ఎక్కడా కనిపించలేదు.అయినప్పటికీ రైతులు పట్టువదలకుండా నిరసన కొనసాగిస్తూనే వున్నారు.
ఇకపోతే విదేశాల్లోని ప్రవాసులు మాత్రం రైతులకు ఇంకా మద్ధతుగానే నిలబడుతుండటం విశేషం.తాజాగా రైతులకు సంఘీభావం తెలిపేందుకు బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమీషన్ కార్యాలయం వెలుపల వున్న పేవ్మెంట్పై 20 మంది రాత్రి నిద్ర చేశారు.
‘‘కిసాన్ స్లీప్ అవుట్’’ కార్యాచరణలో భాగంగా భారత్లోని రైతుల ఆందోళన కార్యక్రమాలను అనుకరించడం దీని ప్రధాన ఉద్దేశం.వీరు ఇలా రాత్రుళ్లు రోడ్లపై నిద్రించడం ఇది మూడోసారి.
భారత్లోని రైతులు ఆందోళన విరమించే వరకు తాము కూడా వారికి మద్ధతుగా వుంటామని చెబుతున్నారు.పంజాబీ సంతతికి చెందిన సిక్కులు మాత్రమే కాకుండా కాకేసియన్లు, ముస్లింలు, ఆఫ్ఘన్లు సహా 40 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వ్యవసాయ బిల్లులు కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వున్నాయని, పేద రైతులను దోపిడి చేసే పెట్టుబడిదారి విధానం తమ తాత, మామలను చంపుతుందని దల్జీత్ సింగ్ అనే కార్యకర్త అన్నారు.ఇంత జరుగుతున్నా హైకమీషన్ కార్యాలయం నుంచి ఏ ఒక్కరూ వచ్చి తమతో మాట్లాడలేదని దల్జీత్ సింగ్ తెలిపారు.
అయితే వీరి నిరసన గురించి తెలుసుకున్న పోలీసులు .వారు లోపలికి వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు.అలాగే రాత్రంతా పేవ్మెంట్ వద్దే మోహరించారు.ఇక బ్రిటన్ ప్రతిపక్షనేత జెరెమీ కార్బన్ పంపిన సందేశాన్ని ఈ సందర్భంగా దల్జీత్ చదివి వినిపించారు.‘‘భారత్లోని రైతుల ఉద్యమాన్ని ప్రపంచం నిశీతంగా గమనిస్తోంది.కార్పోరేట్ల కబంధ హస్తాల నుంచి వారి జీవనోపాధిని కాపాడుకోవడంలో వారు మనందరికీ స్పూర్తినిచ్చారు.
రైతులది హక్కుల కోసం పోరాటం.బ్రిటన్లో అభ్యుదయవాదుల తరపున లండన్లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద జరిగే నిరసనకు మద్ధతు తెలుపుతున్నట్లు ’’ కార్బన్ వెల్లడించారు.
అదే సమయంలో శనివారం రాత్రి న్యూయార్క్, కాలిఫోర్నియా, కెనడాలలో కూడా రైతుల పోరాటానికి మద్ధతుగా స్లీప్ అవుట్ కార్యక్రమాలు జరిగాయి.ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.