తెలంగాణాలో టీఆర్ఎస్ కు ఎదురే లేదు … ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చాలా సంతృప్తి ఉంది.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే అంటూ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న కారు పార్టీ స్పీడ్ కు ఆ పార్టీ అసమ్మతి నాయకులు బ్రేకులు వేస్తున్నారు.
ముందస్తుగా ప్రకటించిన పార్టీ అభ్యర్థుల లిస్ట్ లో తమ పేరు లేకపోవడం.మరికొంతమందిని మార్చాలంటూ కొంతమంది నాయకులు రోడ్డు ఎక్కడం కేసీఆర్ కి కొత్త తలనొప్పిలా మారింది.
ఆఖరికి అధినేత కెసిఆర్ను ధిక్కరించి మరీ భారీగా సదస్సులు నిర్వహిస్తున్నారు.మందీ మార్భలంతో ధిక్కార సదస్సులు .బలప్రదర్శనలు మొదలుపెట్టారు.
టీఆర్ఎస్ లో ఇప్పుడు ఎటు చూసినా అంతా అయోమయమే కనిపిస్తోంది.గులాబీ శిబిరంలో సిట్టింగ్ అభ్యర్థుల బీ -ఫాం గుబులు విస్తరిస్తోంది.ఓరుగల్లు ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో ఒకదాని వెంట ఒకటిగా సంభవించిన పరిణామాలు అధినేతకుసైతం తల నొప్పిగా మారడం సంచలనం కలిగిస్తోంది.
ఓరుగల్లు పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను తాకింది.ఎవరూ ఊహించని రీతిలో ధిక్కారస్వరం వినిపించిన నేతలు తమ అనుచరులను ఉసిగొల్పిమరి చేపట్టిన కార్యకలాపాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది.
క్రమశిక్షణ కలిగిన పార్టీగా గుర్తింపు పొంది అధినేత కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయని భావించిన తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అగ్ర నాయకులకు మింగుడుపడడంలేదు.
ఒక పక్క స్టేషన్ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి డిప్యూటీ సిఎం డాక్టర్ టి.రాజయ్య ఆడియో లీకై పార్టీలో కలకలం రేపడమేకాక అంతే స్థాయిలో ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న రాజారపు ప్రతాప్ బలప్రదర్శన చేపట్టడం జనగామ జిల్లా సరిహద్దు నుంచి స్టేషన్ఘన్పూర్ వరకు ర్యాలీ నిర్వహించడం ఆందోళన కలిగించింది.అంతేకాకుండా శనివారం తాజాగా ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పోటీ చేయాలన్న డిమాండ్తో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు హన్మకొండ సర్క్యూట్ అతిథి గృహం వద్ద బల ప్రదర్శన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనగామలో తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చాలని మండల శ్రీరాములు వర్గీయుల ఆందోళన, పాలకుర్తిలో తమ నేత తక్కళ్లపల్లి రవీందర్రావుకు అవకాశం కల్పించాలంటూ ఆయన అనుయాయులు నిరసనలు చేపట్టడం జనగామ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పార్టీ ఉనికికే ప్రమాదంగా మారింది.ఈ నేపథ్యంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాజా మాజీ స్పీకర్ మధుసూదనచారికి టికెట్ ఇవ్వడంపై అక్కడి నేతలు గుర్రుగా ఉండడమే గాక ఇండిపెండెంట్గా పోటీచేసే దిశలో గండ్ర సత్యనారాయణరావు ఏర్పాట్లు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఇక అదే జిల్లాలోని అపద్ధర్మ మంత్రి అజ్మీరచందులాల్ను పక్కనపెట్టి ఆది వాసీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ విస్తరిస్తోంది.ఆ జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే మహబూబాబాద్ జిల్లాకు వచ్చేసరికి మహబూబాబాద్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ అభ్యర్థిత్వాన్ని తొలగించాలని, డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ గెలిచే అవకాశాలు లేవని ఆందోళన వ్యక్తమవుతోంది.
వరంగల్ అర్బన్లో ఇప్పటికే తూర్పు నియోజకవర్గంకు ఎలాంటి అభ్యర్థిత్వం ఖరారుకాక పోవడంతో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అసమ్మతికి తోడు భారీసంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగి పోటాపోటీగా లాబీ యింగ్ చేస్తున్నారు.