కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్ధలను చిన్నాభిన్నం చేసింది.ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లాక్డౌన్ ప్రభావానికి గురయ్యారు.
దీని కారణంగా మనదేశంలో చిక్కుకుపోయిన ఎన్ఆర్ఐలు, విదేశీయులకు టాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన మొదలైంది.ఈ క్రమంలో వారికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6ను ఉపయోగించుకుని, లాక్డౌన్ వల్ల వారు దేశంలో ఉన్న రోజులను లెక్కలోకి తీసుకోమని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.విమాన సేవల పునరుద్ధరణ జరిగిన అనంతరం గడువు పెంపును మినహాయించి వీరి నివాస కాలాన్ని పరిగణనలోనికి తీసుకుంటామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది.
2019-2020లో అనేక మంది ఎన్ఆర్ఐలు, విదేశీయులు వివిధ పనుల మీద భారతదేశానికి వచ్చారు.తమ ఎన్ఆర్ఐ గుర్తింపుపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు గాను గత ఆర్ధిక సంవత్సరంలోనే తమ స్వస్ధలాలకు వెళ్లిపోవాలని భావించారు.కానీ లాక్డౌన్ కారణంగా వారిలో చాలామంది భారతదేశంలో చిక్కుకుపోయారు.ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఓ వ్యక్తి ఎన్ని రోజుల పాటు మనదేశంలో ఉన్నాడనే దానిపై అతడు భారతీయుడా…? ఎన్ఆర్ఐనా.? అన్న విషయం ఆధారపడి ఉంటుంది.
మరోవైపు లాక్డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ కుదేలై, అన్ని రంగాలూ దెబ్బతినడంతో కేంద్రం మరో భారీ ప్యాకేజీ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది .ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆర్ధిక శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం మే 2న చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.దీనిలో భాగంగా నిర్మలా సీతారామన్ సోమవారం దేశంలోని అన్ని జాతీయ బ్యాంకుల సీఎండీలు, సీఈవోలతో ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా కాస్తంత తగ్గుముఖం పడితే వచ్చే వారమే ఈ ప్యాకేజీకి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.