గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం

రాజన్న సిరిసిల్ల జిల్లా : గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు, ఆయా శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం, క్రైస్తవ ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళ, రామతీర్థం మాధవి హాజరయ్యారు.

 Lets Celebrate Ganesh Navratri With Grandeur, Ganesh Navratri , Mla Adi Sriniva-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు.వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐక్యమత్యంతో చేసుకోవాలని కోరారు.మన దేశ సంస్కృతి,సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయని వివరించారు.పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

మండపాల నిర్వాహకులు, యువత అధికారులు చెప్పే సలహాలు పాటించాలని సూచించారు.ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పోలీస్ శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్స్ లు పెట్టుకోవాలని, నిర్వహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారో పోలీస్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు.హైదరాబాదులో ఇప్పటికే వినాయక నవరాత్రి ఉత్సవాలపై సీఎం సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు.

ఏ ఇబ్బంది ఎదురైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

సమన్వయంతో విజయవంతం చేయాలి

ఈ నెల 7వ తేదీన మొదలు కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఈ సందర్భంగా మున్సిపల్, సెస్, మత్స్య, పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు.

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఆద్వర్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కావాల్సిన క్రేన్స్, జేసీబీలు, విద్యుత్ దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని ఆయా కమిషనర్లు ఆదేశించారు.మండపాల వారీగా మున్సిపల్ సిబ్బందిని నియమించి పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు.

సెస్ అధికారులు వినాయక మండపాలు, నిమజ్జనం రోజున విగ్రహాలు వెళ్లే దారిలో విద్యుత్ తీగలు ఎత్తు పెంచి ఇబ్బంది కలగకుండా చూడాలని, సమస్యల పరిష్కారానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.మత్స్య శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ లో 18 మంది చొప్పున జాలర్లను నియమిస్తామని ఆ శాఖ అధికారులు తెలుపగా, మరో పది మందిని రిజర్వ్ లో వుంచి, లైఫ్ జాకెట్లు సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 108, 24×7 క్విక్ రెస్పాన్స్ టీంలు, మందులు అందుబాటులో ఉంటాయని డీఎంహెచ్ఓ వసంతరావు తెలిపారు.ఎక్సైజ్, అగ్ని మాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు.

నిర్ణీత సమయానికి నిమజ్జనం చేయాలి

జిల్లాలోని అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ మండపం, విగ్రహం ఎత్తు, ఏ రోజున నిమజ్జనం చేస్తారో వివరాలు ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.ఆయా తేదీల్లో విగ్రహాలను నిర్ణీత సమయానికి తరలించి, రాత్రి రెండు గంటల వరకు నిమజ్జనం చేసేలా అందరూ సహకరించాలని కోరారు.

ప్రతి మండపం వద్ద ప్లాస్టిక్ డ్రమ్లలో నీరు, ఇసుక నిలువ ఉంచాలని సూచించారు.పోలీస్ శాఖ వారి https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్సైట్ లో వివరాలు నమోదు చేయాలని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలీ బేగ్, సంపత్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube