అది అలాంటి ఇలాంటి ఆక్టోపస్ కాదు.ఎవరి జాతకం ఎలా ఉండబోతోందో ముందే చెప్పేసి అంచనాలను పెంచేస్తుంది.
ఆ ఆక్టోపస్ మాటలు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మిగతా అన్నిసార్లు నిజం అవ్వడంతో ఆ ఆక్టోపస్ కి అంత క్రేజ్ ఏర్పడింది.ఇంతకీ ఆ ఆక్టోపస్ మరెవరో కాదు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ జాతకం సర్వే రూపంలో చెప్పడం, అక్కడ ఆ సర్వే నిజం అవ్వడం తో దేశవ్యాప్తంగా ఆయన సర్వేకు అంత డిమాండ్ ఏర్పడింది.ఈ మధ్య తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఫలించకపోవడంతో అందరికి ఆయన సర్వే మీద అనుమానం తలెత్తింది.
అయితే ఇప్పుడు ఏపీ ఫలితాల మీద కూడా లగడపాటి జోస్యం చెప్పేందుకు సిద్ధం అవుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.ఏపీలో ఎన్నికల ఫలితాలు కూడా మే 23న విడుదల అవుతాయి.
అయితే ఫలితాల కంటే ముందుగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఎక్జిట్ పోల్స్ హడావిడి మొదలవుతుంది.వీటిల్లో ఏ సర్వే ఎలా ఉన్న అందరి చూపు మాత్రం ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఇచ్చే సర్వే పైనే ఉంది.
ఎన్నో ఏళ్లుగా ఎన్నికల సర్వేలు ఇవ్వడంలో ఆరితేరిన లగడపాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తన సర్వేని రేపు సాయంత్రం 7 గంటలకు తన సర్వే రిజల్ట్స్ విడుదల చేయబోతున్నాడు.
లగడపాటి సర్వే ఏపీ ఎన్నికలపై ఎలా ఉంటుంది.ఆయన సర్వే ఎవరికి అనుకూలంగా ఉంటుంది.అసలు ఆయన సర్వే నిజం అవుతుందా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో లగడపాటి కూడా చాలా పగడ్బందీగా తన సర్వే ఫలితాల్లో పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ ఎన్నికల్లో రాజగోపాల్ టీమ్ దాదాపు ఐదు సార్లు సర్వే చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే లగడపాటి సర్వే మొదలయ్యిందట.ఎన్నికలు ముగిశాక కూడా ఈ సర్వే జరిపించారని తెలుస్తోంది.
అన్నీ రకాలుగా ప్రజల దగ్గర నుంచి వివరాలు రాబట్టి , వాటిని విశ్లేషించి జాగ్రత్తగా రిపోర్ట్స్ తయారుచేశారట.లగడపాటి సర్వే ఈసారన్నా నిజం అవుతుందో లేదో అన్న అనుమానం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది.