సాధారణంగా బడా వ్యాపారులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, పలు ఉన్నత స్థాయి ఉద్యోగుల ఇళ్లల్లో సాధారణంగా ఐటి దాడులు జరగడం మనం చూసి ఉంటాం.కానీ తాజాగా ఓ రైతు ఇంటిలో ఐటి అధికారులు పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆస్తులను అమ్మేసిన ఆ రైతుకు ఉన్నఫలంగా గత రెండు సంవత్సరాలలో అపార సంపద రావడంతో ఆ రైతు ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.
కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణాపురం గ్రామానికి చెందిన సుగీష్ చంద్రన్ మోతుబారి రైతుకి ఒకప్పుడు పంట పొలాలు, ఆస్తులు ఎక్కువగా ఉండేవి.
అయితే క్రమక్రమంగా వీరు ఆస్తులను అమ్ముకొని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అప్పుల్లో కూరుకు పోయిన ఈ రైతు కుటుంబం గత రెండు సంవత్సరాలలో అధిక ఆదాయాన్ని సంపాదించి, తిరిగి భూములను, ఆస్తులను కొనుగోలు చేశారు.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ రైతు కుటుంబం ఉన్నఫలంగా ఇంత ఆస్తులను సంపాదించడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వీరి అభివృద్ధి వెనుక చెన్నై లోని ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న తన కొడుకు, ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న తన కుమార్తె, అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటి పరిశోధనలలో అధికారులు గుర్తించారు.
కరోనా లాక్ డౌన్ కి ముందు అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ అనే వ్యక్తికి సంబంధించిన పురాతన బంగ్లాను కొనడంతో, గత వారం రోజుల నుంచి ఐటీ అధికారులు వీరిపై దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి పెద్దఎత్తున ఐటి అధికారులు వీరి ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు.
అయితే తమ కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ను టార్గెట్ చేసి ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.అమాంతంగా పెరిగిన తన సంపద గురించి అధికారులు ఆరా తీస్తూ దర్యాప్తును వేగం చేస్తున్నారు.
అయితే అకస్మాత్తుగా వీరి ఆస్తి పెరగడం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.