అభిషేక ప్రియుడు బోలాశంకరుడికి నైవేద్యంగా పంచామృతాలను, పండ్లను ఇతర అన్న ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించడం మనం చూసే ఉంటాము.కానీ పురాణాలలో శివుడికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప స్వామి వారికి నిత్యం మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే వారని మనకు తెలిసిందే.
అచ్చం భక్తకన్నప్ప మాదిరిగానే నీలకంఠపురంలో వెలసిన నీలకంటేశ్వరుడికి ఆ గ్రామస్తులు ఇప్పటికీ మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.మరి ఈ ఆలయంలో స్వామివారికి మాంసాన్ని ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారో? ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
అనంతపురం జిల్లా పెనుగొండలోని మడకశిరలో ఉన్న ఈ ఆలయాన్ని స్వయంభుగా భక్తులే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. సుమారు 12 వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మహిషాసురమర్దిని శివలింగం ఆంజనేయ విగ్రహాలు ఉండేవట.
కొన్నాళ్ల తర్వాత ఆ గ్రామం మొత్తం శిధిలం కావడంతో ఆ గ్రామస్తులు అందరూ వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు.ఆ విధంగా కొందరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఆ సమయంలో వారికి ఈ విగ్రహాలు లభించడంతో వారే స్వయంగా ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించారు.
శివుడిని నీలకంఠుడుగా కొలవడం వల్ల ఆ గ్రామానికి నీలకంఠాపురం అనే పేరు వచ్చింది.
ఈ విధంగా ఈ గ్రామంలో వెలసిన నీలకంఠేశ్వరునికి ఏ భక్తుడో మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు.అప్పటి నుంచి ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఇప్పటికీ ఆచారంగా వస్తోంది.ఈ విధంగా స్వామివారికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని మునీశ్వరుడుగా పిలుస్తారు.
కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆలయ బాధ్యతల్ని అప్పటి మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు చూడటం వల్ల ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది.ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల మాజీ మంత్రి రఘువీరారెడ్డి తిరిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు.అదేవిధంగా శివరాత్రి కార్తీకమాసం వంటి ప్రత్యేక రోజులలో ఈ ఆలయ దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు.