మన భారత దేశంలో ఎన్నో విచిత్రాలకు, ఆచారాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న కొన్ని ఉత్సవాలను ఇప్పటికీ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండడం విశేషం.
అయితే ఈ విధమైనటువంటి కొన్ని ఆచారాల గురించి తెలిసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.అలాంటి వింత ఆచారాలలో ఒకటే అనంతపురం జిల్లాలో ఉరవకొండలో జరిగే గవి మఠం బ్రహ్మోత్సవాలు అని చెప్పవచ్చు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా కురుబ కులస్తులు ఆచరించే వింత ఆచారం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఉత్సవాలలో భాగంగా కురుబ కులస్తులు శునకాల్లా మారి అరుచుకుంటూ గిన్నెలో ఉన్నటువంటి పాలు తాగడం వల్ల ఆ శివుడి కృప వారిపై కలుగుతుందన్న నమ్మకంతో ఇప్పటికీ భక్తులు అక్కడ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
భక్తులు కుక్కల్లాగా మారి పాలు తాగుతూ, అరిచే ఈ కార్యక్రమాన్ని ఒగ్గుసేవగా పిలుస్తారు.ఈ కార్యక్రమంలో భాగంగా దొన్నెలలోని(గిన్నెలలో) వేసిన పాలను గొరువయ్యలు శునకాల్లాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగుతారు.
ఈ విధంగా ఈ ఆచారాన్ని బ్రహ్మోత్సవాలలో చివరి రోజున నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు గిన్నెలలో పాలు పండ్లు వేసి వాటిని వరుసగా ఉంచుతారు.కురుబ కులస్తులు గొరవయ్య వేషధారణలో డమరుకం వాయిస్తూ కుక్కల మాదిరిగా అరుస్తూ, ఒకరిపై ఒకరు నోటితో కరుచుకుని నడుస్తూ ఆ గిన్నెలో ఉన్నటువంటి పాలు, పండ్లను శివుడి ప్రసాదంగా భావించి కుక్కలు మాదిరిగా నాలుకతో తింటారు.
ప్రతి ఏటా జరిగే ఉత్సవాలలో భాగంగా చివరి రోజున భక్తులు ఈ విధమైన ఆచారాన్ని పాటిస్తున్నారు.ఈ ఆచారం పాటించడం వెనుక కూడా ఓ పురాణ కథ దాగి ఉంది.పూర్వం అమృతం కోసం సాగర మధనం చేసినప్పుడు సముద్రగర్భం నుంచి విషం ఉద్భవిస్తుంది.
అది తాగిన పరమేశ్వరుడు నిద్రపోకుండా ఉండడం కోసం రాత్రంతా పెద్ద ఎత్తున దేవతలందరూ భజనలు చేస్తూ ఉంటారు.అయితే కొంత సమయానికి దేవతలు నిద్రపోవడంతో పార్వతీదేవి ఒక గిన్నెలో ఆరు కుక్కలకు కలిపి పాలు పోయటం వల్ల అవి పాలను తాగటానికి గట్టిగా అరుచుకుంటూ, పోట్లాడుకుంటూ ఉండటం వల్ల ఆ పరమశివుడు నిద్రపోలేదని చెబుతారు.
ఈ విధంగా శివుడు నిద్రపోకుండా చేసిన ఆ భైరవాంశ సంభూత రూపాలే గొరవయ్యలని చెబుతుంటారు.ఈ కారణంగానే ప్రజలు శుకాల్లాగా మారి పాలు తాగుతూ శివుడికి సేవ చేస్తారని భక్తులు విశ్వసిస్తూ ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు.
TELUGU BHAKTHI