కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో తరచు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు.ఈ బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామివారిని వివిధ అలంకరణలో అలంకరించి వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధులలో ఉరేగిస్తూ ఉంటారు.
అయితే ఇప్పటివరకు మాడవీధులు అనే పేరు వినే ఉంటాం కానీ అసలు ఈ మాడవీధులు అంటే ఏమిటి? ఈమాడ వీధులకు ఏ విధంగా ఆ పేరు వచ్చాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.అయితే తిరుమల మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమలలోని శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు వైపుల ఉన్న ప్రధాన రహదారులనే మాడ వీధులు అంటారు.తమిళంలో ఈ ఆలయం చుట్టూ ఉన్న రహదారుల పక్కన అర్చకులు నివసించడానికి ఉండే ఇళ్ళను మాడం అని పిలిచేవారు.
ఈ పేరే క్రమంగా మాడవీధులుగా మారింది.నాలుగు దిక్కులలో ఉన్న ఈ ఈ రహదారులను తూర్పు మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తరమాడ వీధి, దక్షిణ మాడ వీధి అనే పేర్లతో పిలుస్తారు.

పూర్వం శ్రీవారి ఆలయం చుట్టూ ఈ విధమైనటువంటి రహదారులు లేకపోవడంవల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ధ్వజారోహణ చేసి మిగతా కార్యక్రమాలను తిరుచానూరులో చేసేవారు.శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగించడానికి ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే ఈ ఆలయం చుట్టూ ఉన్న రహదారులను వెడల్పు చేసి వాటిని మాడవీధులుగా ఏర్పాటు చేశారు.ఈ విధంగా అప్పటి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపినప్పుడు ఈ నాలుగు మాడ వీధుల వెంట స్వామివారిని మిగతా వాహనాలపై వివిధ అలంకరణలో ఊరేగిస్తారు.