ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు చెలరేగిపోతుంటారు.ఆయన నిర్ణయాలపై మండిపడుతుంటారు.
గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ఆయన ప్రకటించినప్పుడు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.ఇప్పుడు ఆయన ప్రకటించిన మరో నిర్ణయంపై పోరాటానికి దిగారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పదకొండు ఎకరాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తానని ఆయన ప్రకటించిన వెంటనే విద్యార్థులు ‘ఇది నీ అబ్బ సొత్తా?’ అని ప్రశ్నించారు.ఒక్క అంగుళం కూడా వదిలేది లేదని ప్రతిన బూనారు.
సోమవారం నుంచే పోరాటం ప్రారంభించారు.ఇప్పుడు భూములను తీసుకొని పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెబుతున్న కేసీఆర్ తరువాత కాలంలో ఉస్మానియా భవనాలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తారని విమర్శించారు.
విద్యార్థులు సచివాలయంలోని సి బ్లాక్ దగ్గర ఆందోళన చేశారు.అడ్డగించిన పోలీసులతో తలపడ్డారు.
ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహానికి తలొగ్గి కేసీఆర్ తన నిర్ణయం మార్చుకుంటారా? లేదా మొండిగా వ్యవహరిస్తారా? కేసీఆర్ మొండితనానికి దిగితే విద్యార్థులు రణరంగం సృష్టించడం ఖాయం.వారు కేసీఆర్తో తాడో పేడో తేల్చుకుంటారు.