సీఎంరిలీఫ్ ఫండ్ బిల్లులపై జరుగుతున్న అసత్య ప్రచారం సరైంది కాదని, మా ఆసుపత్రి పేరుతో తప్పుడు లెటర్ హెడ్ సృష్టించి బిల్లులు తయారు చేయడం, దానికి సంబంధించిన సంబంధిత డాక్టర్ కు మా ఆసుపత్రితో సంబంధంలేదని శ్రీ వినాయక ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పసుమర్తి లక్ష్మణరావు అన్నారు.బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులు తమ ఆసుపత్రి పేరుతో ఇచ్చినట్లు, గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుందని దీనిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు మా ఆసుపత్రిలో విచారణ జరిపారని తెలిపారు.
వాస్తవంగా మా ఆస్పత్రి శ్రీ వినాయక పేరుతో బిల్లులు ఇవ్వలేదని, సంబంధిత డాక్టర్ మా ఆసుపత్రిలో పనిచేయడంలేదని స్పష్టం చేశారు.
కావాలని కొందరు శ్రీ వినాయక ఆసుపత్రి పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు, మా ఆసుపత్రి లెటర్ హెడ్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి అక్రమార్గంలో సీఎంఆర్ఎఫ్ బిల్లులు పొందేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.
విచారణకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు సమర్పించామని, ఆ బిల్లులకు మా ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేదన్నారు.సంబంధిత పేషెంట్ కూడా మా ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేదని వివరించారు.
ఆ లెటర్ హెడ్ లో డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్, స్టాంపులు, సంతకాలు మావి కావని అటువంటి వాటికి మా ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మాపై అభియోగాలు మోపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారులను వేడుకున్నారు.
జరిగిన పరిణామాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.మా ఆస్పత్రి బిల్లులు పారదర్శకంగా ఉంటాయని ఎటువంటి అవకతవకలకు తావులేదని తెలిపారు.
కావాలనే ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.విలేకరుల సమావేశంలో రవి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.







