కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 60 యేళ్ళ లోపు మహిళల ప్రవేశం గురించి దాదాపు నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే.శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
కాని భక్తులు వారిని అడ్డుకుంటూ వస్తున్నారు.భక్తులు అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం మరియు పోలీసులు భారీ భద్రత మద్య తాజాగా ఇద్దరు మహిళలను అయ్యప్ప దర్శనంకు తీసుకు వెళ్లి దర్శనం చేయించారు.
అయ్యప్ప దర్శనం చేసుకున్న మహిళలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) బుధవారం వేకువ జామున పోలీసు రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు.
దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు మూడు నెలల తరువాత అమలుకు నోచుకున్నట్లయింది.లింగ సమానత్వం కోరుతూ కేరళ వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు రాష్ట్రం ఒక చివర నుంచి మరో చివర వరకు మానవహారం ఏర్పాటుచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
మహిళల ప్రవేశం తరువాత ఆలయ ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు.ఆ తరువాతే ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి.
నల్లటి దుస్తులు ధరించిన ఈ ఇద్దరు భక్తులు అర్ధరాత్రి పంబ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి స్వామి సన్నిధికి చేరుకున్నారట.తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం.ఆ సమయంలో పెద్దగా భక్తజన సందోహం లేకపోవడంతో వీరికి తొందరగానే దర్శనమైనట్లు తెలుస్తోంది.దర్శనం ముగిసిన తరువాత పోలీసులు ఆ ఇద్దరిని గుర్తు తెలియని చోటుకు తరలించారు.