టీటీడీ ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది.వరుసగా టీటీడీ లో సిబ్బంది,అర్చకులు పలువురు కరోనా బారిన పడుతుండగా ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్ స్వామికి కూడా కరోనా నిర్ధారణ కావడం కలవరపెడుతుంది.
ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 90 మందికి సిబ్బంది కానీ,అర్చకులు కానీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా పెద్ద జీయర్ స్వామికి కూడా కరోనా నిర్ధారణ కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
ఇప్పటివరకు దాదాపు 15 మందికి పైగా అర్చకులు కరోనా బారిన పడిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల అర్చకులతో అత్యవసర సమావేశం నిర్వహించి 60 ఏళ్లు పై బడిన వారు స్వామి వారి సేవకు కొద్దీ రోజులు దూరంగా ఉండాలని,వారంతా కూడా విశ్రాంతి తీసుకోవాలి అంటూ సూచనలు చేశారు.
అలానే స్వామి వారి సేవలు ఏవి కూడా నిలిపివేయడానికి వీలులేదని,యధావిధిగా స్వామి వారి సేవలు కొనసాగుతాయి అంటూ ఆయన స్పష్టం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానంలో విపరీతంగా పెరుగుతున్న భక్తుల రాక నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఒకపక్క కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ చైర్మన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తో టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా తప్పు పట్టారు.ఇప్పటి వరకు 15 మంది అర్చకులు కరోనా బారిన పడుతున్నప్పటికీ దర్శనాలు నిలిపివేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబడుతూ బహిరంగంగానే పేర్కొన్నారు.
దీనిపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా గట్టి సమాధానం కూడా ఇచ్చారు.అయితే కొందరు అర్చక పెద్దలు మాత్రం అర్చకులకు కరోనా వచ్చినప్పటికీ అది భక్తుల వల్ల రాలేదని,అసలు టీటీడీ లో ఈ మహమ్మారి ఎలా వచ్చింది అనేది తెలియడం లేదు అంటూ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం స్వామి వారి దర్సనాలు కొనసాగుతుండగానే ఇప్పుడు తాజాగా పెద్ద జీయర్ స్వామి ని కూడా ఈ మహమ్మారి తాకడం ఆందోళన కలిగిస్తుంది.
ప్రస్తుతం స్వామీజీ ని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్ కు అధికారులు తరలించినట్లు తెలుస్తుంది.
అయితే ఇలా వరుసగా కరోనా కేసులు పెరుగుతుండడం తో మరోసారి ఈ అంశం పై పునఃసమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకొనే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం.మరి ఇప్పటికైనా దర్సనాలు నిలిపివేస్తారా,లేదంటే కొనసాగిస్తారా అన్న అనుమానం అందరిలో వ్యక్తం అవుతుంది.