వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యారు.చాలా కాలంగా సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేస్తూ, వైసీపీ పాలనను తప్పుపడుతూ జగన్ నూ విమర్శిస్తూ హడావుడి చేస్తున్నారు.
దీంతో రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.కాకపోతే వైసిపి మాత్రం ఆయన పై బహిష్కరణ వేటు వేయడం లేదు.
అలా చేస్తే ఆయనకు ఫిరాయింపు చట్టం నిబంధనలు వర్తించవు అనేది వైసిపి అభిప్రాయం.రఘురామకృష్ణరాజు సైతం పార్టీకి రాజీనామా చేయకుండానే, ఆ పార్టీ ఎంపీగా ఉంటూ పదే పదే విమర్శలు చేస్తూ వైసిపికి ఇబ్బందికరంగా మారారు.
ప్రతిపక్షాల స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మీడియా, సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూ లు ఇస్తూ వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.
అలాగే చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉంటూ , ఏపీకి వస్తే తనకు ప్రాణభయం ఉంది అంటూ ఆరోపణలు చేయడమే కాకుండా, తనకు భద్రత పెంచాలంటూ కేంద్రాన్ని ఆయన కోరడంతో ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించారు.
పోనీ బిజెపి ఆయనను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందా అంటే అదీ లేదు.బ్యాంకు మోసాలు, వ్యాపార లావాదేవీలపై అప్పుడప్పుడు సిబిఐ దాడులు జరుగుతున్నాయి.ఇప్పటి కే ఆయనకు సొంత జిల్లా పశ్చిమ గోదావరి లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.వైసిపి ఎమ్మెల్యేల తో పాటు, కొంతమంది వివిధ కేసుల్లో ఫిర్యాదు చేశారు.
ఆయన ఎప్పుడు సొంత జిల్లాలో అడుగుపెడతారా ? ఆయన అరెస్టు చేద్దామంటూ పోలీసులూ కాచుకు కూర్చున్నారు.ఇదిలా ఉండగా, రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో కేసు వేశారు.దీని పైన విచారణ ప్రారంభమైంది.జగన్ కూ నోటీసు అందింది.17వ తేదీ న దీనిపై విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదిలా ఉండగా , సినీనటి శ్రీ రెడ్డి ,రఘురామ కృష్ణంరాజు మధ్య సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజుల క్రితమే విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి.
ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.వైసీపీ అగ్ర నాయకులను ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు, కుల పరంగానూ విమర్శలు చేశారు.
దీనిపై వైసిపి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని అంతా అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆయనను హైదరాబాదు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు.30 మంది సిఐడి పోలీసులు హఠాత్తుగా రఘురామకృష్ణంరాజు నివాసానికి వెళ్లడం, వివిధ సెక్షన్ల కింద ఆయనను అరెస్టు చేయడం, అది కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా, కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో అరెస్టు చేసి వైసిపి తన పంతం నెగ్గించుకుంది.అయితే రఘురామకృష్ణంరాజు అరెస్టుపై ఇప్పటికే వివిధ పార్టీల నేతలు స్పందించారు .కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ఆ సమస్యలను పట్టించుకోకుండా ,ఇప్పుడు ఈ అరెస్ట్ అంత అవసరమా అంటూ నాయకులు స్పందిస్తున్నారు.కాకపోతే రఘురామకృష్ణంరాజు అరెస్టుకు దారితీసిన పరిణామాలు ఆయన స్వీయ తప్పిదాలుగానే కనిపిస్తున్నాయి.అప్పుడే ఈ ఎపిసోడ్ అయ్యేది కాదు.ఇంకా ఎన్నో మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.