స్మితా సబర్వాల్ పై మాజీ ఎమ్మెల్యే కంచర్ల సంచలన వ్యాఖ్యలు...!

నల్లగొండ జిల్లా:నువ్వు ఐఏఎస్,నీ భర్త ఐపిఎస్ కావడంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావని తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్పై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి,తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అన్నివైపులా నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయని,అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారిణిగా ఉండి, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు.స్మితా సబర్వాల్ ఓ దివ్యాంగులకి జన్మనిచ్చి ఉంటే వారి కష్టాలు ఏంటో ఆమెకు తెలిసేవన్నారు.

దివ్యాంగులను అవహేళన చేసి,వారి మనోధైర్యాన్ని దెబ్బతినేలా కుట్ర చేస్తున్న స్మితా సబర్వాల్,మెంటల్ గా అన్ ఫిట్ అని,ఐఏఎస్ గా పనికి రాదని,వెంటనే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.ఎన్నో ఆటుపోట్లను,కష్టనష్టాలను ఎదుర్కొని బాలలత లాంటి ఓ దివ్యాంగ మహిళ ఐఏఎస్ కాగలిగిందని,తనతో పాటే ఎంతోమందిని ఐఏఎస్ లుగా తయారు చేసేందుకు ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎంతోకృషి చేస్తున్నారని కొనియాడారు.

బాలలత లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి దివ్యాంగులనే హేళన చేయడం సరికాదన్నారు.ప్రపంచమే గర్వించదగ్గ ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారని,అటువంటి వారిని అవమానించడం సహేతుకం కాదని హితువు పలికారు.

Advertisement
పారా సెటమాల్ పరేషాన్ లో ప్రజలు...!

Latest Nalgonda News