ఎంతో మంది భక్తులు ఆంజనేయస్వామికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి భయాందోళనలు లేకుండా మనలో ధైర్యాన్ని నింపుతారని భావిస్తారు.
ఈ క్రమంలోనే ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన వాటితో పూజలు చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు.ఇకపోతే ప్రతి ఒక్కరు ఆంజనేయస్వామిని బ్రహ్మచారి అని పిలుస్తుంటారు.
నిజానికి ఆంజనేయస్వామికి వివాహం జరిగినప్పటికీ స్వామివారిని బ్రహ్మచారి అని పిలవడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియదు.మరి ఆంజనేయస్వామిని అలా పిలవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి సూర్యభగవానుడు దగ్గర అన్ని విద్యలను నేర్చుకున్నాడు.అయితే సూర్యభగవానుడు ఆంజనేయస్వామికి నేర్పించాల్సిన ఒకే ఒక విద్య మిగిలిపోతుంది.
ఆ విద్య నేర్పించాలి అంటే తప్పనిసరిగా తనకు వివాహం జరగాలి.ఈ క్రమంలోనే సూర్యభగవానుడు తనకు ఆ విద్యను నేర్పించడం కోసం తన కూతురిని ఆంజనేయస్వామికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తారు.

ఈ సమయంలోనే సూర్య పుత్రిక అయినటువంటి సువర్చలను వివాహం చేసుకోమని చెబుతాడు.వివాహమైన మరుక్షణం తన కూతురు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటుందని వివాహం తరువాత ఆంజనేయ స్వామి కూడా గృహస్థుడు కావాలని కోరుకో కూడదని చెబుతారు.ఈ క్రమంలోనే అందుకు అంగీకరించిన హనుమంతుడు సూర్య పుత్రిక సువర్చలను వివాహం చేసుకుంటారు.వివాహం అనంతరం ఆమె తపస్సు కోసం అరణ్యాలకు వెళ్ళగా ఆంజనేయస్వామి ఆ విద్యను అభ్యసిస్తారు.
ఇలా వివాహమైన తర్వాత ఏ రోజు కూడా తను గృహస్తుడు కావాలని భావించలేదు కనుక ఆంజనేయ స్వామికి వివాహం అయిన బ్రహ్మచారిగానే పిలుస్తారు.