రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీద శ్రీనివాస రావు అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేయడం… ఆ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపట్టడం జరిగిపోయాయి.
ఇక అప్పటి నుంచి అనేక కోణాల్లో ఈ కేసును విచారిస్తూ అనేక వివరాలను రాబడుతూ… ఎన్ ఐ ఏ అధికారులు ముందుకు వెళ్తున్నారు.దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రకరకాలుగా వస్తుండడం… ఈ కేసులో నిందితులు, న్యాయవాదులుగా ఉన్న వ్యక్తుల భద్రతపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇకపై ఈ కేసు విచారణ రహస్యంగా నిర్వహించాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అందుకే ఇకపై ఈ కేసు విచారణకు సంబంధించి వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.అసలు ఈ కేసు నేపధ్యం చూస్తే… గత సంవత్సరం అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, కాబట్టి దీనిని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారణ చేసిన ఉమ్మడి హైకోర్టు, దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.
దీంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది.ఈ కేసులో ఇటీవలే చార్జ్షిట్ సైతం ఎన్ఐఏ దాఖలు చేసింది.అయితే, కోడికత్తి కేసు ఎన్ఐఏకు అప్పగించడం పై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఉగ్రవాదం, విమానాల హైజాక్ కేసులను దర్యాప్తు చేసే సంస్థకు కోడికత్తి అప్పగించడమేంటని కోర్టులో వాదనలు వినిపించింది.
అయినా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడానికే హైకోర్టు మొగ్గుచూపింది.ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ ఈ కేసు మీడియా ద్వారా అనేక కధనాలు వెలుగులోకి తీసుకొచ్చి లబ్ది పొందాలని చూసింది.
కాకపోతే కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడంతో టీడీపీకి ఈ విషయంలో టెన్షన్ తప్పినట్టే కనిపిస్తోంది.