టీమిండియా హెడ్ కోచ్ పగ్గాలను త్వరలోనే రాహుల్ ద్రవిడ్ చేపట్టనున్నారు.ఇంకో వారం రోజుల్లోగా న్యూజిలాండ్తో టీమిండియా సిరీస్ ప్రారంభమవుతుంది.
అప్పటి నుంచి ద్రవిడ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు.రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవీ కాలం చెల్లడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.
అంతేకాదు సహాయక సిబ్బంది విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా మార్చేస్తోంది బీసీసీఐ.ఇందులో భాగంగా కోచింగ్ స్టాఫ్ కొరకు బీసీసీఐ అప్లికేషన్లను ఆహ్వానించింది.
ఈ నేపథ్యంలో పాత వారిలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్నారు తప్ప మిగతా వారెవరూ దరఖాస్తు చేసుకోలేదు.దాంతో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) దరఖాస్తు సమీక్షించి రాథోడ్ను మళ్ళీ బ్యాటింగ్ కోచ్ గా నియమించింది.
బౌలింగ్ కోచ్గా కొత్తగా పరాస్ మంబ్రేను సెలెక్ట్ చేసింది.ఇదిలా ఉండగా ఎన్ఏసీలో రాహుల్ ద్రవిడ్ సహచరుడు, ఇండియా-ఏ, ఇండియా అండర్ – 19 జట్లకు కోచ్గా వ్యవహరించిన అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్ పదవికి ఎంపిక చేస్తారని అందరూ భావించారు.
కానీ అలా జరగలేదు.ఎందుకంటే శ్రీలంక పర్యటనలో తెలంగాణకు చెందిన టి.దిలీప్ కనబరిచిన పనితీరు రాహుల్ కి బాగా నచ్చింది.అందుకే అతను దిలీప్ కు అవకాశం ఇవ్వాలని తన నిర్ణయాన్ని చెప్పారు.
దాంతో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా మన తెలుగు రాష్ట్రానికి చెందిన టి.దిలీప్ నియామకం ఖరారయ్యింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఎంపికైనట్లు హెచ్సీఏ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఒక తెలుగు వ్యక్తి జాతీయ స్థాయిలో క్రికెట్ లో మంచి బాధ్యతలు చేపట్టబోతున్నారు అని హర్షం వ్యక్తం చేసింది.అలాగే అతన్ని హెచ్సీఏ అభినందించింది.హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్ సైతం దిలీప్ నియామకంపై ఆనందం వ్యక్తం చేశాడు.బీసీసీఐ ఈ ముగ్గురి నియామకాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.