ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి దాని ఆధారంగా రేషన్ కార్డులను జారీ చేసింది.అయితే తాజాగా సమగ్ర కుటుంబ సర్వేను పక్కన పెట్టి ఏకసభ్య కార్డులను రద్దు చేయాలని నిర్ణయించడంతో లబోదిబోమనటం లబ్తిదారుల వంతైంది.
తాజా ఆదేశాల ప్రకారం కార్డులో ఒకే సభ్యుడు లేదా సభ్యురాలు ఉంటే ఆ కార్డును రద్దు చేసి వారిని వారి బంధువుల కార్డుల్లో సంబంధిత అధికారులు కలపాల్సి ఉంటుంది.దీంతో పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు అన్ని జిల్లాలలో ఏక సభ్యకార్డులను గుర్తించే పని ప్రారంభించారు.
అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో లబ్ది పొందాలంటే రేషన్ కార్డు ప్రధానమైనది.అధికారులు కూడా ఇలానే ప్రచారం చేయటంతో ఉమ్మడి కుటుంబాలలో ఎవరి వారీ విడిపోయి మరీ తమ కుటుంబానికి రేషన్కార్డులు కోసం అర్జీలు చేసుకున్నారు.
ప్రభుత్వం కూడా అన్ని అర్హతలను పరిశీలించిన తదుపరే కార్డులను జారీ చేసింది.ఎలాంటి ఆశ్రయం లేకపోవటంతోనే ఒంటరిగా ఉంటున్నామని, ఇప్పుడు అనర్హత పేరుతో కార్డులను రద్దు చేయటంతో బతుకు భారమవుతుందని తమ కార్డులను కొనసాగించాలని వృద్ధులు, వితంతువులు, ఆదరణలేని అభాగ్యులు కోరుతున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే, రేషన్ కార్డుల ఆధారంగా ఆసరా పింఛన్లు, రేషన్ సరకుల పంపిణీ, ఇతర పథకాలను అమలు జరుగుతున్నా, ఒంటరిగా ఉన్న వారిని వారి బంధువుల కార్డులలో చేర్చాలన్న నిర్ణయం కొత్తతలనొప్పి తెస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు.ఇప్పటికే పెన్షన్, ఇతర ప్రభుత్వ లబ్ది పొందుతున్న కుటుంబంలో కి తమని చేరిస్తే, ఒక కుటుంబానికి ఒకటే పెన్షన్, ఇల్లు, ఇలా ప్రభుత్వ ప్రయోజనాలు తమకు అందకుండా పోతుందన్నది వారి వాదన.
అది జరగనున్న వాస్తవం కూడా.
ప్రభుత్వ పథకాల దుర్వినియోగం విషయమై తగిన చర్యలు తీసుకోలేక, చాపకింద నీరులా ప్రభుత్వ ఈ ఆదేశాలు ఇచ్చిందని గుసగుస వినవస్తోంది.
మరోవైపు ఈ విషయమై తమకో ఆయుధం లభించినట్టు విపక్షాలు సంబరపడుతున్నాయి.