తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో చిత్ర విచిత్రమైన పరిణామాలు ఎన్నెన్నో చోటుచేసుకుంటున్నాయి.ఇక్కడ టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉండడంతో, ఆయన హవా ఎలా అయినా తగ్గించి ఓడించాలని, ఆయనను ఓడించగల నేతక టికెట్ ఇవ్వాలని కెసిఆర్ అభిప్రాయ పడుతున్నారు.
ఈ మేరకు ఆ స్థాయిలో బలమున్న నాయకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే అనేక మంది పేర్లను కెసిఆర్ పరిగణలోకి తీసుకున్నారు.
వారు ఎవరైతే బావుటుందని అనే లెక్కలు వేస్తున్నారు.ఈ క్రమంలోనే విద్యార్థి సంఘం నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గెల్లు శ్రీనివాస్ కు దాదాపు టికెట్ ఖాయమయిందని ప్రచారం జరుగుతుండగా, ఆయనకు ఆ టికెట్ రాకుండా కేటియార్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఓ యువ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు దాదాపు ఖాయమైంది ఈ మేరకు మంత్రి హరీష్ రావు సైతం సిద్దిపేటలో సమావేశాలు నిర్వహిస్తూ హుజురాబాద్ పరిణామాలపై చర్చిస్తున్నారు.హరీష్ రావు తో పాటు గెల్లు శ్రీనివాస్ కూడా ఆ సమావేశాల్లో పాల్గొంటూ ఉండటం తో ఆయనకు టికెట్ కన్ఫామ్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది.
అయితే మాజీ విద్యార్థి నేత ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ రాకుండా ఆ యువ ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థి సంఘం నేపథ్యం నుంచి వచ్చిన తనకు పార్టీలో మంచి గుర్తింపు ఉందని, ఇప్పుడు మరో విద్యార్థి సంఘం నేతకు ఈ టిక్కెట్ వస్తే తన ప్రభావం తగ్గిపోతుందనే ఆందోళనలో ఆయన అభ్యర్థత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హుజూరాబాద్ నియోజకవర్గం లో పెద్దగా పట్టు లేదని, కేవలం విద్యార్థి సంఘాలతో మాత్రమే పరిచయం ఉందని, ఆయనకు కాకుండా వేరే ఒకరికి టికెట్ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవంగా హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డికి కానీ , మాజీ మంత్రి పెద్దిరెడ్డి కానీ ఇస్తారని అంత అభిప్రాయపడ్డారు.అనూహ్యంగా కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.అలాగే ఈటెల రాజేందర్ బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, అదే బిసి సామాజిక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టాలని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు మొగ్గు చూపినా, ఆయనకు టికెట్ రాకుండా సొంత పార్టీ నేతలే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు టిఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.