ఏపీలో అధికార టీడీపీ దూకుడుతో విపక్ష వైసీపీ గుండెళ్లో రైళ్లు ఓ రేంజ్లో పరిగెడుతున్నాయి.టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరిపోయారు.
రెండు విడతల్లో జరిగిన ఈ ఆపరేషన్ ఆకర్ష్లో ఇప్పుడు మూడో ఫేజ్ స్టార్ట్ అవుతోంది.ఈ మూడో ఫేజ్లో సైతం 10 మంది వరకు ఎమ్మెల్యేలు సైకిలెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ మూడో ఫేజ్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ముందుగా ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిలెక్కనున్నట్టు తెలుస్తోంది.శ్రీకాకుళం జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ మూడు స్థానాలు గెలుచుకుంది.
ఇక్కడ నుంచి గెలిచిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇప్పటికే సైకిలెక్కేశారు.ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీడీపీ వైపే చూస్తున్నారని ఏపీ పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్లో వార్తలు వినవస్తున్నాయి.
జిల్లాలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వనరాయ కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మూడో ఫేజ్లో భాగంగా వైసీపీలో పడే 22, 23 వికెట్లుగా తెలుస్తోంది.వీరిద్దరితోనే ఆపరేషన్ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవనుందని టాక్.
ఇక వీరితో పాటు కృష్ణా జిల్లాలో నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి సైతం పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధంగానే ఉన్నారట.
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి, కంబాల జోగులు సైకిలెక్కడంలో మంత్రి కిమిడి కళా వెంకట్రావు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
వీరిద్దరు కూడా టీడీపీలో చేరిపోతే శ్రీకాకుళం జిల్లాలో వైసీసీ శూన్యమవుతుంది.ఇక కృష్ణా జిల్లాకు చెందిన ప్రతాప్, రక్షణనిధి పార్టీ మారితే అప్పుడు ఆ పార్టీకి జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కరే మిగిలుతాడు.