కరోనా మహమ్మారి చైనా లోని వూహన్ ల్యాబ్ లో తయారైంది అని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.అయితే అమెరికా చైనా పై చేస్తున్న ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు చూపడం లేదని అది కేవలం ఊహాజనితమైన ఆరోపణలు మాత్రమే అంటూ WHO కొట్టిపారేసింది.
అమెరికా చెబుతున్న దానికి వారి వద్ద ఎటువంటి ఆధారాలు చూపడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఆ దేశం దగ్గర ఎటువంటి ఆధారం లేదని దీనికి సంబంధించి ఎటువంటి డేటా కానీ,ఆధారం కానీ అందలేదని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.
వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వ్యాపించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పొంపియో కూడా పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.అయితే అగ్రరాజ్యం ఆరోపణల తో వైరస్ పుట్టుకకు సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి ఆధారం ఉన్నా కూడా వాటిని స్వీకరిస్తాం అంటూ డబ్ల్యూ హెచ్ వో స్పష్టం చేసింది.
ఒకవేళ అమెరికా వద్ద డేటా, కానీ ఆధారాలు కానీ ఉంటే, అప్పుడు ఆ దేశామే ఆ డేటాను షేర్ చేయవచ్చు అని, ఒకవేళ అలాంటి సమాచారం ఉంటే, అది పబ్లిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్గా మారుతుందని ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ అంటున్నారు.ప్రస్తుతం వైరస్కు సంబంధించి 15 వేల జన్యుక్రమ వివరాలు తమ దగ్గర ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో నిపుణులు చెబుతున్నారు.అయితే ఆ వివరాలను పరిశీలించిన మీదట ఈ వైరస్ అనేది సహజసిద్ధమైనదే తప్ప మానవ సృష్టి కాదు అని తేలినట్లు చెప్పారు.సహజంగా కరోనా వైరస్ గబ్బిల్లాల్లో ఉంటుందని, కానీ మనుషులకు ఎలా పాకిందన్న విషయాన్ని నిర్దారించాలని, ఎటువంటి జంతువు ఈ క్రమంలో హోస్ట్గా వ్యవహరించిందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
అయితే శాస్త్రీయ పద్ధతిలో దీనిపై విచారణ జరగాలని, వైరస్ ఏ జీవిలో ఉంది, అది ఏ జీవిని హోస్ట్గా చేసుకుని వ్యాపించిందో వంటి అంశాలను స్టడీ చేయాలంటూ WHO స్పష్టం చేసింది.