ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలో ఎంపీలతో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసారు.కేంద్రంపై పోరాటం చేస్తాం అని ఇప్పటికే స్పష్టం చేసారు ఏపీ సీఎం.
ఇక తదుపరి నరేంద్ర మోడీ పరిపాలన పై ఎలాంటి వత్తిడి పెంచాలన్న విషయాలను చర్చించేందుకే ఈ రోజు తన పార్టీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
మరో మూడు రోజుల్లో పార్లమెంట్ తదుపరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, ఈ సమావేశాలు ముగిసే లోపే, రాష్ట్రానికి సాధ్యమైనంత సహాయాన్ని కేంద్రం నుంచి రాబట్టేలా తమ పార్టీ కృషి చేయాలనీ బాబు తమ పార్టీ మెంబెర్స్ కి ఆదేశించనున్నారు.
పార్లమెంట్ లో తన ఎంపీలు ఎలా అనుసరించాలో,వారి వైఖరిని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలకు పదును పెట్టనున్నారు.అమరావతి ఇప్పటికే చేరుకున్న ఎంపీలు, చంద్రబాబుతో భేటీ అనంతరం రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది.
అయితే, మరి విభజన హామీలపై బీజేపీ ముందడుగు వేయకుంటే, వారితో పొత్తుకు వెళ్తారా, లేక కటీఫ్ చెప్పేంతటి తీవ్రమైన నిర్ణయాలను టీడీపీ అధినేత తీసుకుంటారా? అన్న విషయమై చర్చ సాగుతోంది.అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇదే సమయంలో రేపు బీజేపీ నేతలు కూడా ఇదే విధమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు హద్దులను దాటిన నేపథ్యంలో ఈ రెండు సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు బయటకొస్తాయి అన్న ఆసక్తి నెలకొంది.