పార్టీని మళ్లీ అధికారం లోకి తీసుకువచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ చాలానే కష్టపడాల్సి ఉంటుంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 11 స్థానాలను మాత్రమే దక్కించుకుని , ఘోర ఓటమిని చవిచూసింది.
ఇక ఈ ఐదేళ్లు పార్టీని ముందుకు నడిపించడం జగన్( YS Jagan Mohan Reddy ) కు అతిపెద్ద సవాల్ గా మారబోతుంది .ఈ ఐదేళ్లు పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసుకోవడంతో పాటు , వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగినా, వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ , మళ్లీ ఎన్నికల నాటికి బలం పుంజుకుంటేనే జగన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లారని , కేవలం ఒకరిద్దరు సన్నిహితులకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ, వారి చెప్పినట్లుగానే పాలన చేసి ఈ స్థాయిలో పార్టీ ఓటమికి కారణమయ్యారనే విమర్శలు జగన్ పైన ఉన్నాయి .

ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ సలహాదారు , జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కారణమని వైసీపీ ఓటమి తర్వాత అనేక విమర్శలు సొంత పార్టీ నాయకులు చేశారు.అధికారంలో ఉండగా జగన్ ను ఎవరు కలవాలన్నా ముందుగా సజ్జల అనుమతి ఉంటేనే అది సాధ్యమయ్యేదని , చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక సజ్జల హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి.వైసిపి ఓటమి తర్వాత కూడా సజ్జలతో పాటు మరికొంతమంది కోటరీ నాయకులకే జగన్ ప్రాధాన్యం ఇస్తుండడం పైన పార్టీలో అసంతృప్తి పెరుగుతుంది.

వైసీపీ( YCP )ని పూర్తిగా ప్రక్షాళన చేసి, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేయగలిగిన బలమైన నేతలకు పదవులు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని, అంతకంటే ముందుగా జగన్ కోటరీ లోని నాయకులను పక్కన పెట్టాలని, అప్పుడే జగన్ అనుకున్న లక్ష్యం చేరుకోగలుగుతారని ఆ పార్టీ నాయకులే సూచిస్తున్నారు.ముఖ్యంగా అప్పటి వైసిపి ప్రభుత్వం లోనూ , ఇప్పుడు ఓడిన తరువాత తమ నోటి దురుసును ప్రదర్శిస్తూ, వైసిపికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్న నాయకులను జగన్ పక్కన పెట్టాలనే సూచనలు చేస్తున్నారు.