మనం సాధారణంగా ఇంటిలో లేదా దేవాలయాలలో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ప్రత్యేకంగా హోమం చేయిస్తాము.ఈ హోమం చేయించడానికి పవిత్రమైన హోమం ద్రవ్యాలను ఉపయోగిస్తారు.
ఎంతో పవిత్రంగా, నియమనిష్ఠలతో, భక్తిభావంతో జరిపించే హోమం వల్ల ఆ దేవతల అనుగ్రహం కలిగి మనం అనుకున్న కార్యక్రమాలను నెరవేరుస్తూ ఉంటారు.ఇంతటి భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హోమం పూర్తయిన తర్వాత ఏర్పడే భస్మం మన నుదిటిపై ధరించడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
అయితే ఏ దేవుడికి నిర్వహించిన హోమం తర్వాత ఏర్పడే భస్మం ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
*మొదటగా అగ్ర పూజ్యుడైన వినాయకుడికి నిర్వహించిన హోమంలోని భస్మాన్ని ధరించడం వల్ల మనం చేపట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి.
*శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమంలోని భస్మాన్ని ధరించడం వల్ల మన ఇంట్లో ఏర్పడినటువంటి కలహాలు, మనస్పర్ధలు తొలగిపోయి సుఖసంతోషాలతో గడుపుతారు.
*శ్రీ దుర్గా మాత హోమంలోని భస్మాన్ని ధరించడం వల్ల శత్రు వినాశనం జరిగి శత్రువుల నుంచి ప్రాణాపాయం లేకుండా ఎంతో ధైర్యంగా జీవిస్తారు.

*శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే దీర్ఘకాలికంగా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొంది ఆయురారోగ్యాలతో ఉంటారు.
*నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్న వాటి నుంచి విముక్తి పొంది సుఖంగా జీవితం గడుపుతారు.
*శ్రీ మృత్యుంజయ హోమంలోని భస్మాన్ని ధరిస్తే అకాల మరణ గండం తొలగిపోయి మృత్యుంజయుడుగా జీవిస్తారు.

*శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరించడం వల్ల భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోయి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు.
*హోమం ఎంతో నిష్టగా భక్తితో నిర్వహించడం వల్ల హోమం చేసిన తర్వాత ఏర్పడిన భస్మాన్ని ఎటువంటి పరిస్థితులలో కూడా కింద వేయరాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.