సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పచ్చ కండువాలు రెపరెపలాడాయి.భట్టి మెడలో ఏకంగా చంద్రబాబు కండువాలు దర్శనమిచ్చాయి.
అటు సీపీఎం జెండా కూడా ఎగిరింది.దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ మళ్లీ కూటమిగా వస్తాయనే ప్రచారం జోరందుకుంది.
ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల పార్టీ నేతల సమావేశంలో టీఆర్ఎస్, ఎంఐఎంతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు.కానీ, ఇతర పార్టీలతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు.
ఇదే సందర్భంలో ఇతర పార్టీలతో నేతల కలుపుగోలు కూటమిపై అనుమానాలుకు తావిస్తోంది.
ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు రెండు రోజులుగా బోనకల్లు మండలంలో తెలుగుదేశం, సీపీఐ పార్టీలు సంఘీభావం తెలిపినట్లు ప్రకటించాయి.
ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడితో సహా పలువురు నేతలు భట్టి వెంట నడిచారు.అయితే, పాదయాత్రకు సంఘీభావం తెలిపినట్లు చెప్పుతున్నా.భట్టి మాత్రం ఏకంగా టీడీపీ కండువాలు మెడలో వేసుకున్నారు.ఆ కండువాలతోనే యాత్ర చేశారు.
దీంతో పార్టీ శ్రేణులు సైతం ఖంగుతిన్నారు.ఇప్పటికే కాంగ్రెస్పై టీడీపీ ముద్ర ఉందంటూ వివాదాలు వస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి వ్యవహారం రాష్ట్రంలో పొత్తు సంకేతాలిచ్చినట్లైంది.
సాధారణ లీడర్లు కండువాలు వేసుకుంటే పెద్దగా ఆసక్తి కనిపించకపోయినప్పటికీ.ఏకంగా సీఎల్పీ నేతగా ఉన్న భట్టి వేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీకి ఓటు బ్యాంకు ఇంకా ఉంది.ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్ టీడీపీ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులుగా గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు.ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి అభ్యర్థులను నిలబెట్టకుండా.తమకు మద్దతుగా ఉండాలనే అభిప్రాయాలను టీడీపీ నేతలతో పంచుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి.ఈ లెక్కన టీడీపీ ఓటు బ్యాంకును తమవైపు రాబట్టుకునేందుకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పచ్చ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
సవాల్ మళ్లీ పాత కథ దీంతో కాంగ్రెస్ నేతలు మళ్లీ పాత కథను పునరావృతం చేసుకుంటున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా కూటమిని ఆయుధంగా మార్చుకున్నారు.తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు, సీపీఎం పార్టీలు కూటమిలో భాగస్వాములు కావడం, అటు చంద్రబాబు ప్రచారానికి రావడంతో కేసీఆర్కు బ్రహ్మాస్త్రం అందించారు.తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబును భుజాలపై మోసుకుంటూ వస్తున్నారంటూ కాంగ్రెస్ను తూర్పారబట్టారు.
ఇది చాలా సెగ్మెంట్లలో ప్రభావం చూపించింది.టీఆర్ఎస్ మినహా.
అన్ని పార్టీలు ఒక్కటైనా ఫలితాలు కనిపించలేదు.కేసీఆర్కు బ్రహ్మాస్త్రం తాజాగా పాత కథే పునరావృతమవుతుందనే చర్చ మొదలైంది.
ఇప్పటికే కాంగ్రెస్లోని కొంతమంది సీనియర్లు టీ కాంగ్రెస్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్ర కాంగ్రెస్ నడుస్తుందనే ఆరోపణలు సైతం చేశారు.ఇలాంటి సమయంలో భట్టి విక్రమార్క పాదయాత్రలో పచ్చ కండువాలు సందడి చేశాయి.ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటున్న టీఆర్ఎస్కు.సెంటిమెంట్ రూపంలో కాంగ్రెస్ పార్టీ మరో బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లుగా సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.తెలంగాణలో సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ఏదో ఓ సందర్భంలో కేసీఆర్కు టీడీపీ సాకుగా దొరుకుతోంది.
వచ్చేదంతా ఎన్నికల సమయమని భావిస్తున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క పాదయాత్ర రూపంలో మరో బ్రహ్మాస్త్రం చిక్కినట్లుగా మారింది.ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం లేదు.
పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గం ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేవిధంగా లీకులిస్తోంది.
హస్తం పార్టీలో ఈ రాద్ధాంతం ఎలా ఉన్నా.ఇటు టీఆర్ఎస్కు మాత్రం సెంటిమెంట్కు మరో సాకు దొరికినట్లు భావిస్తున్నారు.పొత్తు సంకేతాలేనా? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో టీడీపీ, సీపీఎం భాగస్వామ్యం కావడం పొత్తుపై చర్చలు మొదలయ్యాయి.అటు రాహుల్ గాంధీ కేవలం టీఆర్ఎస్, ఎంఐఎంతో మాత్రమే పొత్తు ఉండదని ప్రకటించారని, కానీ, టీఆర్ఎస్ వ్యతిరేక పక్షాలన్నీ కలిసిపోతాయని ముందస్తుగానే పొత్తుపై సంకేతాలిచ్చినట్లు రాజకీయవర్గాలు చెప్పతున్నాయి.అటు కాంగ్రెస్లోనూ దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి పొత్తు మళ్లీ తెరపైకి వచ్చినట్లేనని కొంతమంది చెప్పుతుండగా, కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సీఎల్పీ నేత భట్టి పచ్చ కండువాలు మెడలో వేసుకోవడం రాజకీయ చర్చకు దారి తీసింది.