నకిలీ… ఈ మాటను మనం తరతరాలనుండి వింటూనే వున్నాము.ఎందుకంటే మోసం చేయడం అనేది అనాదిగా వస్తోంది.
సమాజంలో కొంతమంది కేటుగాళ్లు డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డ దార్లు ఎంచుకుంటూ వుంటారు.వీరి ఇపుడు మనుషులు, ముఖ్యంగా యువత ఎంతగానో ఇష్టపడుతున్న చాక్లెట్స్ పై పడ్డారు.
మార్కెట్లో విరివిగా నకిలీ చాక్లెట్స్ విక్రయాన్ని మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో రాచకొండ ఎస్వోటీ పోలీసులు నకిలీ చాక్లెట్స్ గోదాములపై దాడులు చేశారు.
కాలం చెల్లిన చాక్లెట్స్ కు కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్ చేస్తున్నట్లు గుర్తించారు.దాంతో చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళితే, బోడుప్పల్ రెడ్డి కాలనీలో ఓ భవనం రెండో అంతస్తులో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగుతోంది.పక్క సమాచారంతో అక్కడికి చేరుకున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 6.50 లక్షల రూపాయల విలువ చేసే పిల్లల తినుబండారాలు, కాస్మోటిక్స్ ఇతర ఐటెమ్స్ స్వాధీనం చేసుకున్నారు.కాగా పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు ముమ్మురంగా గాలిస్తున్నారు.
అక్కడి వ్యవహారం చూసి పోలీసులకు మతి పోయింది.కాసుల కక్కుర్తితో ఇంత దారుణంగా కల్తీ చేస్తున్నారా అని అవాక్కయ్యారు.
కాలం చెల్లిన చాక్లెట్స్, అదే విధంగా నాసిరకం మెటీరియల్ తో తయారు చేయబడిన ఆహార పదార్ధాలను వారు సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించారు.ఇక పాత వాటికి కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు.ఏ వస్తువుకైనా ఎక్స్ పైరీ అనేది ఉంటుంది.ముఖ్యంగా తినే వస్తువులకు అయితే కచ్చితంగా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.ఇపుడు దానినే వారు క్యాష్ చేసుకుంటున్నారు.చాలా తేలికగా డేట్ మర్చి మార్కెట్లో వాటిని అమ్మేస్తున్నారు.
అవి తింటే ప్రాణాలకే ప్రమాదం.పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నవారికి శిక్ష తప్పదని రాచకొండ పోలీసులు చెబుతున్నారు.