చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5బీ వై3 రాకెట్కు సంబంధించిన భారీ శకలాలు భూ ఉపరితలంలోకి ప్రవేశించాయి.రాత్రి సమయంలో కావడంతో మిరిమిట్లు గొలుపుతూ హిందూ మహా సముద్రంలో పడిపోయాయి.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం కావాల్సిన ల్యాబరేటరీ మాడ్యూల్ని చైనా దేశం ఈనెల 24న లాంగ్ మార్చ్ 5బీ వై3 ద్వారా తరలించిన విషయం అందరికీ తెలిసిందే.
మలేషియాలోని కుచింగ్ పట్టణం ఉపరితలంలో విచ్ఛిన్నమైన చైనా రాకెట్ శకలాలు హిందూ మహా సముద్రంలో పడిపోయాయని అమెరికా అంతరిక్ష కమాండ్ ధృవీకరించింది.తూర్పు, దక్షిణాసియాలోని పలు ప్రాంతాల్లో ఈ శకలాలు మండుతూ భూ వాతావరణంలోకి రావడాన్ని ప్రజలు వీక్షించారు.
అయితే, గతంలోనూ చైనా ఇలాగే రెండుసార్లు రాకెట్ బూస్టర్ల రీఎంట్రీని సరైన మార్గంలో చేయకపోవడంతో భూ ఉపరితలంలోకి వచ్చాయి.లాంగ్ మార్చ్ 5బీ సముద్రంలో పడటంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పింది.