సాగర తీరంలో వారసుల మధ్య వార్...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) లోవారుసుల మధ్య వార్ టగ్గాఫ్ వార్ గా సాగుతోంది.కాంగ్రెస్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జై వీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సిహయ్య కుమారుడు భగత్ హోరాహోరీగా తలపడుతున్నరు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి నోముల నర్సింహయ్య,కాంగ్రెస్ నుండి కుందూరు జానారెడ్డి పోటీ పడగా జానాపై నోముల విజయం సాధించారు.2021లో నోముల నర్సింహయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నోముల కుమారుడు భగత్ ను రంగంలోకి దింపగా,మళ్లీ జానారెడ్డి పోటీ చేసి భగత్ చేతిలోనూ ఓటమి చవిచూశారు.

ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తమ కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డిని( Kunduru Jaiveer Reddy ) బరిలో దించారు.ఇద్దరూ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి రావడం,ఇద్దరూ ప్రధాన పార్టీలకు చెందిన యువ నాయకులు కావడంతో సాగర్ ఎన్నికపై అందరిచూపు పడింది.

సాగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జైవీర్ రెడ్డి ఏడాది ముందు నుండే చైతన్య యాత్ర పేరుతో గ్రామాలను పర్యటించారు.ఇదే సమయంలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.

పనిలో పనిగా ఎమ్మెల్యే నోముల భగత్ పై నాన్ లోకల్ ముద్ర వేసి విస్తృతంగా ప్రచారం చేశారు.కానీ,బీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తమ పార్టీ అసంతృప్తులు కాపాడుకొనే పనిలోనే ఉండిపోయారు.

Advertisement

ఎమ్మెల్యేగా రెండేళ్లు అయినా ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అప్పుడప్పుడు నోటికి, చేతికి కూడా పని చెప్పి వివాదాల్లో చిక్కుకున్నారు.

ఇదే అదునుగా భావించిన జై వీర్ రెడ్డి,తండ్రి జానారెడ్డి ( Jana Reddy )రాజకీయ అనుభవంతో గులాబీ క్యాడర్ కు గండి కొట్టే పనిలో నిమగ్నమయ్యారు.ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి సాగుతున్న వలసల పర్వానికి తండ్రి కొడుకుకు పన్నిన రాజకీయ తంత్రమే కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇద్దరు యువ నేతల్లో జై వీర్ రెడ్డి( Jaiveer Reddy ) తొలిసారి పోటీలో ఉండడం,అందరికంటే ముందే ప్రజల్లోకి వెళ్ళడం, రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) వేవ్ రావడం అడ్వాంటేజ్ గా మారిందని అంటున్నారు.ఇక బీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు రావడం, ఎమ్మెల్యేగా సాగర్ అభివృద్ధిపై దృష్టి పెట్టకడం పోవడం,స్థానికుడు కాకపోవడం,సొంత పార్టీ నేతల నుండే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవడం ప్రతికూలంగా మారిందనేచర్చ జరుగుతుంది.

ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనున్న నేపథ్యంలో సాగర్ ఓటరు నాడి ఏ విధంగా ఉందో అర్దం కావాలంటే మరి కొద్దీ రోజులు వేచిచూడాల్సిందే.

Advertisement

Latest Nalgonda News