సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలలో భాగంగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడుతుండడం మనం చూస్తూ ఉంటాము.ఈ విధంగా పిడుగులు పడినప్పుడు పడిన ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతుంటారు.కానీ 12 సంవత్సరాలకు ఒకసారి శివాలయంలో ఉన్న శివుడి మీద పిడుగు పడుతుంది.
ఆ పిడుగు ప్రభావానికి ఆలయంలో ఉన్న శివలింగం ముక్కలు ముక్కలుగా మారి తెల్లవారేసరికి యదా స్థితికి చేరుకుంటుంది.అయితే అక్కడ ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మరి పిడుగు పడే శివాలయం ఎక్కడ ఉంది? పిడుగు పడటం వెనుక గల కారణం ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్లోని కులూ వ్యాలీలో ఉన్న బిజిలి మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం పై ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడుతుంది.
ఈ పిడుగు దాటికి ఆలయంలో ఉన్న శివలింగం తునాతునకలు అయిపోతుంది.కానీ మరుసటి రోజు ఉదయం ఆలయంలోకి పూజారి చేరుకుని అక్కడ శివలింగాన్నికి అభిషేకం చేయడం ద్వారా ఆ శివలింగం యథాస్థానంలోకి చేరుతుంది.
అయితే దీని వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పటికీ ఆ రహస్యాన్ని కనుక్కోలేకపోయారు.

పురాతన కథనం ప్రకారం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట.ఈ వ్యాలీలో ఉన్న ప్రజలను, పశు పక్ష్యాదులను సంపాదించటానికి పెద్ద సర్ప రూపంలో అవతరించి బియాస్ నది ప్రవాహానికి అడ్డు పడి ఆ గ్రామాలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు.ఈ సంఘటన చూసి ఆగ్రహించిన పరమశివుడు ఆ రాక్షసుని తన త్రిశూలంతో సంహరిస్తాడు.
దీంతో ఆ రాక్షసుడు ఆ ప్రాంతంలో పెద్ద కొండగా అవతరిస్తాడు.ఆ విధంగా ఆ ప్రాంతంలో కొండ ఏర్పడినప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు ప్రమాదం వాటిల్లుతుందని భావించిన పరమేశ్వరుడు ఆ కొండపైనే వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
అదేవిధంగా ఆ రాక్షసుని దేహాన్ని నాశనం చేయడానికి పరమేశ్వరుడు ఇంద్రుడికి పిడుగు వేయాల్సిందిగా ఆదేశిస్తాడు.అయితే ఆ పిడుగు పడటం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అని భావించి తనమీదే పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుని కోరుతాడు.
ఆ విధంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ శివలింగం పై పిడుగు పడుతుంది.కానీ ఈ ఆలయం ఏమాత్రం చెక్కుచెదరకుండా మరుసటి రోజు ఉదయానికి శివలింగం తిరిగి అతుక్కొని ఉంటుంది.
అయితే ఆ కొండపై ఉన్న శివుడికి ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తారు.