మన దేశవ్యాప్తంగా ఉన్న పురాతనమైన పుణ్యక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తిరుమల పుణ్యక్షేత్రం కూడా ఒకటి.ఈ పుణ్యక్షేత్రానికి మన దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ప్రతిరోజు లక్షలలో జనాలు వచ్చి శ్రీవారికి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.2022 వ సంవత్సరంలో శ్రీవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు.2022 వ సంవత్సరంలో ఏప్రిల్ వరకు కరోనా ఆంక్షలు అమలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తర్వాత అన్ని రకాల ఆంక్షలు రద్దు చేయడంతో సర్వ దర్శనానికి, వివిధ రకాల దర్శనాలకు భక్తులు భారీ ఎత్తున వచ్చారు.
అప్పటి నుంచి స్వామి వారికి హుండీ కానుకలు కూడా భారీ ఎత్తున రావడం మొదలైంది.శ్రీవారిని 2022వ సంవత్సరంలో దాదాపు 2.35 కోట్లు మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.హుండీ కానుకల రూపంలో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.తిరుమల శ్రీవారికి 2022వ సంవత్సరం హుండీ కానుకల రూపంలో వచ్చిన మొత్తం ఆదాయం రూ.1320 కోట్లు.
స్వామివారికి 1.08 కోట్ల మంది భక్తులు తల నీలాలను సమర్పించినట్లు తెలిపారు.2022 వ సంవత్సరం 11.42 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.
బంగారు నిల్వలు, ఆస్తుల వివరాలను వెల్లడించడంతో పాటు దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిలవడం విశేషం అని ఈ సందర్భంగా తెలిపారు.అంతేకాకుండా 2022లో ఇంతమంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న ఎలాంటి చెడు సంఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కూడా తెలిపారు.
ఎందుకంటే భక్తులకు ఎలాంటి సదుపాయాల లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.