సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుడికి ఎంతో నిష్టగా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాము.అయితే ఏదైనా తీపి పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం మన ఆచారం.
కానీ కొన్ని చోట్ల గ్రామ దేవతలకు పొట్టేలు, కోళ్లను బలి ఇవ్వడం మనం చూస్తుంటాము.ఇలా బలి ఇచ్చే సమయంలో కూడా అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాన్ని సమర్పిస్తాము.
కానీ మీరు ఎప్పుడైనా స్వామివారికి ప్రసాదంగా మటన్ బిర్యాని పెట్టడం గురించి విన్నారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
అయితే ఇలా దేవుడికి మటన్ బిర్యాని పెట్టే ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆచారం ఎందుకు వచ్చింది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడులోని మదురైలో మునియంది ఆలయం ఉంది.
ఈ ఆలయంలో స్వామివారికి భక్తులు మటన్ బిర్యానీని ప్రసాదంగా సమర్పిస్తారు.అయితే ఈ విధంగా స్వామివారికి మటన్ బిర్యానీ పెట్టడం వెనుక గల కారణం ఏమిటి ఈ ఆచారం ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయానికి వస్తే …ఈ ఆలయంలో స్వామివారికి మటన్ బిర్యానీ పెట్టే ఆచారం 1973 నుంచి వస్తుందని స్థానికులు తెలియజేస్తున్నారు.అసలు ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారికి మటన్ బిర్యాని పెట్టడం వెనుక గల కథ ఏమిటంటే….
1973లో మదురై జిల్లాలోని వడకంపట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందడంతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సమీపంలో ఉన్నటువంటి ఆలయంలోని స్వామి వారికి ఎంతో సంతోషంగా భక్తితో మటన్ బిర్యాని చేసి నైవేద్యంగా సమర్పించారు.ఈ విధంగా అప్పటి నుంచి ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి భక్తులందరూ మటన్ బిర్యాని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇప్పటికీ ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు స్వామివారికి మటన్ బిర్యాని ప్రసాదంగా పెడతారు.ఇక ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవాలలో భక్తులు పాల్గొనీ స్వామివారికి ప్రసాదంగా మటన్ బిర్యానీ సమర్పిస్తారు.
ఇలా మటన్ బిర్యానీ సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అక్కడి భక్తుల విశ్వాసం.