సాధారణంగా మహిళలు ఎక్కువగా ఆలయాలను దర్శించడం మనం చూస్తూనే ఉంటాం.వారికి ఇష్టదైవం రోజున మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు.
కొందరు కోరికలను కోరడానికి ఆలయానికి వెళితే,మరికొందరు మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.ఈ విధంగా గుడికి వెళ్లడం ద్వారా వారిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని భావిస్తారు.
అయితే గుడికి వెళ్ళేటప్పుడు మహిళలు ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరించి వెళ్లాలని మన శాస్త్రం చెబుతోంది.ఆలయానికి సందర్శించేటప్పుడు మహిళలు ఏ ఆలయానికి ఏవిధంగా వెళ్లాలో ఇక్కడ తెలుసుకుందాం.
మహిళలు అమ్మవారి ఆలయానికి వెళ్లేటప్పుడు తప్పకుండా పసుపు, కుంకుమ, దానిమ్మ పండ్లు, ఎర్రటి పువ్వులను తీసుకు వెళ్లడం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది.అదే విధంగా సరస్వతి ఆలయాన్ని దర్శించే మహిళలు తెల్లటి పువ్వులు, పాలు, పాయసం వంటివాటిని సరస్వతీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి.
అదేవిధంగా మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించే మహిళలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులు, తామర పువ్వులు, పసుపు, ఎరుపు, తెలుపు పుష్పాలను ఎక్కువగా తీసుకువెళ్లాలి.

వినాయకుని గుడికి వెళ్లే మహిళలు తప్పకుండా గరికను తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించాలి.ప్రతి శుక్రవారం గరికమాలను వినాయకుడికి సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలతో గడుపుతారు.ఇంట్లో ఏవైనా బాధలో ఉన్నప్పుడు, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు బిల్వదళాలతో శివాలయానికి వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించినప్పుడు తులసిమాల తప్పనిసరి.ఆంజనేయుని దర్శించినప్పుడు సింధూరం, తమలపాకులు తప్పనిసరి.
ఈ విధంగా స్వామి వారికి ఎంతో ఇష్టమైన వస్తువులను తీసుకువెళ్లి సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.అదేవిధంగా ఆలయానికి బయలుదేరిన సమయం నుంచి ఇంటికి చేరుకునే వరకు మన మనస్సు ఆ దేవుడు పై పెట్టాలి.