సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గాలి బలంగా వీచింది.ఆగాలి స్పీడ్ కి తెలుగుదేశం పార్టీ అతలాకుతలం అయ్యింది.
ఆ ఎదురుగాలిలోనూ హిందూపురంలో చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తట్టుకుని నిలబడగలిగాడు.అసలు ఎన్నికల ముందు హిందూపురంలో బాలయ్యకు ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశమే లేదని ప్రచారం కూడా జరిగింది.
కానీ ఆ ఎన్నికల్లో టిక్కెట్ ఆయనకే దక్కడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిపోయాయి.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.
పార్టీ వీడే నాయకులంతా తెలుగు దేశం మీద చంద్రబాబు, బాలయ్య అల్లుడు లోకేష్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అయినా బాలయ్య ఎక్కడా స్పందించడం లేదు.
తాను సినిమాల్లో బిజీగా ఉన్నట్టుగా అందుకే రాజకీయ విషయాలు పెద్దగా పట్టించుకోలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇక విషయంలోకి వస్తే బాలయ్య త్వరలో సీఎం జగన్ కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.
అంటే బాలయ్య పార్టీ మారాలనే ఉద్దేశంతో అయితే కాదట.ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గ ప్రజలకు బాలయ్య అనేక హామీలు ఇచ్చాడు.
కానీ తాను గెలిచినా పార్టీ గెలవకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.దీంతో నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండడంతో తమ నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఒక ఫైల్ తయారు చేసుకుని జగన్ కు ఇవ్వాలని, అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరాలని బాలయ్య భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ముందుకు కదులుతారు అనేదే అస్పష్టంగా ఉంది.