అంజనీ పుత్రుడైన హనుమంతుడు లేని గ్రామాలు ఉండవు.ధైర్యానికి సాహసానికి ప్రతీకగా హనుమంతుడిని భక్తులు పూజిస్తారు.
రామాయణంలో హనుమంతునికి ప్రత్యేకమైన స్థానం ఉంది.రామ భక్తునిగా రామదాసునిగా ఆంజనేయుడు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
భర్త రక్షకుడుగా ఉంటూ భక్తుల చేత విశేషమైన పూజలు అందుకొంటున్న ఆంజనేయుడికి మంగళవారం లేదా శనివారం ఎంతో ప్రీతికరమైన రోజు.ఈ రెండు రోజులలో స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికలను తెలియజేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఆంజనేయస్వామికి ఏ పదార్థాలతో అభిషేకం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
ఆంజనేయ స్వామికి తేనెతో అభిషేకం చేయటం వల్ల తేజస్సు అభివృద్ధి చెందుతుంది.అదేవిధంగా ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి.
ఆవుపాలతో అభిషేకం చేయటం వల్ల సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
సర్వ పాపాలు తొలగిపోవాలంటే విభూతితో అభిషేకం చేయాలి.భూ వివాదాలు ఉండి భూలాభం కలగాలంటే పుష్పాలతో ఆంజనేయస్వామికి అభిషేకం నిర్వహించాలి.
భోగభాగ్యాలు కావాలనుకునేవారు ఆంజనేయుడికి బిల్వదళ జలాలతో అభిషేకం చేయాలి.
పంచదారతో ఆంజనేయస్వామికి అభిషేకం చేయటం వల్ల దుఃఖాలు నశిస్తాయి.

చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనం వృద్ధి చెందుతుంది.సర్వ సంపదలు కలగాలంటే కొబ్బరినీళ్ళతో అభిషేకం నిర్వహించాలి గరిక నీటితో ఆంజనేయుడికి అభిషేకం చేయటం వల్ల పోగొట్టుకున్న ఆస్తి తిరిగి సంపాదించుకోగలరు.అన్నంతో అభిషేకం చేయటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది.మామిడి పండ్ల రసంతో సర్వ వ్యాధులు నయమవుతాయి.పసుపు నీటితో అభిషేకం చేయటం వల్ల సకల శుభాలు ప్రాప్తిస్తాయి.నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల మృత్యుభయం తొలగిపోతుంది.
సింధూరంతో అభిషేకం చేస్తే శని దోష నివారణ కలుగుతుంది.ఈ విధంగా వివిధ రకాల పదార్థాలతో ఆంజనేయుడికి అభిషేకం చేయడం వల్ల వివిధ ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.