వారంలో మొదటి రోజు అయిన ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఈ ఆదివారాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు.
సంస్కృతంలో భానువారం అని, హిందీలో రవివార్ అని పిలుస్తుంటారు.వారంలో మిగతా రోజులతో పోలిస్తే ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
అంతే కాకుండా ఆదివారం ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పవచ్చు.ఇలాంటి ఎంతో పవిత్రమైన ఆదివారం కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
అయితే ఆదివారం పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా ఆదివారం సెలవు కావడంతో అందరూ ఎంతో బద్ధకంగా ఉంటారు.ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేవడం వంటి పనులను చేస్తుంటారు.
కానీ ఆదివారం సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానమాచరించి, సూర్యనమస్కారం చేసుకోవాలి.అదే విధంగా సూర్యునికి మూడు సార్లు నీటిని వదిలి నమస్కరించిన తరువాత సూర్యస్తోత్రం పఠించాలి.
అనంతరం ఆలయాన్ని దర్శించి ఎరుపు రంగు పుష్పాలను స్వామివారికి సమర్పించాలి.అదేవిధంగా సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆదివారం ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకొని, ఎరుపు వస్త్రాలను ధరించడం వల్ల దీర్ఘసుమంగళీ వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు.
ఆదివారం రోజున సూర్యభగవానుడికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.అలాగే గోధుమలతో తయారు చేసిన చపాతీలు ఆదివారం భుజించడం వల్ల ఆరోగ్య పరంగా మంచిదని పండితులు చెబుతున్నారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం సూర్య భగవానుడుకి ఈ నియమాలను పాటిస్తూ పూజ చేయటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.అదేవిధంగా ఆదివారం ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉన్న నవగ్రహాలను సందర్శించి సూర్యభగవానుడికి ప్రత్యేకమైన అభిషేకం నిర్వహించి, పూజ చేయటం వల్ల గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి.
ప్రతి ఆదివారం నియమాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి.