రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న నిర్మాణ, సుందరీకరణ పనులను ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.
సత్య ప్రసాద్ తో కలిసి వేములవాడ మున్సిపాలిటీ అధికారులతో అభివృద్ధి పనుల ప్రారంభానికి చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కోటి రూపాయలతో నంది కమాన్ జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేస్తున్నామని తెలిపారు.ప్లాజా ఏర్పాటు చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
1 కోటి 98 లక్షల రూపాయలతో బ్రిడ్జి నుండి వైకుంఠధామం వైపు 330 మీటర్ల మేర నిర్మిస్తున్న మూలవాగు బండ్ నిర్మాణం, సుందరీకరణ పనులను ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.31 లక్షల 60 వేల రూపాయలతో నిర్మిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు.ప్లాంట్ ట్రయల్ కూడా పూర్తయిందని, ప్రారంభానికి సిద్ధంగా ఉందని మున్సిపల్ అధికారులు కలెక్టర్ కు వివరించారు.2 కోట్ల 91 లక్షల రూపాయలతో నిర్మించిన వెజ్ మార్కెట్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని అన్నారు.
2 కోట్ల 37 లక్షల రూపాయలతో కోరుట్ల బస్టాండ్ నుండి మల్లారం జంక్షన్ వరకు, కోరుట్ల బస్టాండ్ నుండి భీమేశ్వర గార్డెన్స్ వరకు చేపడుతున్న ఫుట్ పాత్ పనుల పురోగతిపై ఆరా తీసిన కలెక్టర్ ఈ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.బద్దిపోచమ్మ, మినీ ట్యాంక్ బండ్, శివార్చన స్టేజీ శంఖుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, డీఈ తిరుపతి, ఏఈ నరసింహ, నర్మద, తదితరులు ఉన్నారు.