శ్రావణ మాసం హిందూ ప్రజలకు ఎంతో ముఖ్యమైన మాసం.ఈ నెల మొత్తం మహిళలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తుంటారు.
ఈ విధంగా వ్రతాలు చేయడం వల్ల వారి కుటుంబం సకల సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటుందని భావిస్తారు.ఈ క్రమంలోనే ఇలాంటి వ్రతాలు చేయడానికి కొందరు మాత్రమే అర్హులని భావిస్తుంటారు.
ముఖ్యంగా ఈ విధమైనటువంటి వ్రతాలు చేయడానికి గర్భిణీ స్త్రీలు సంకోచం వ్యక్తం చేస్తుంటారు.అయితే శ్రావణ మాసంలో ఎంతోమంది వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.
అయితే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది.మరి గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేస్తారు.వరలక్ష్మీ వ్రతం చేయటం వల్ల అమ్మవారు ప్రీతి చెంది మనకు సకల సంపదలను ఇస్తారని భావిస్తారు.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తారు.అయితే సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పెద్దలు చెబుతుంటారు.
అయితే గర్భిణీ స్త్రీలు కూడా నిస్సంకోచంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేయవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

సాధారణ మహిళలు చేసిన విధంగానే వరలక్ష్మీ వ్రతాన్ని గర్భిణి స్త్రీలు కూడా చేసుకోవచ్చు.అయితే గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకూడదని, ఉపవాసంతో వ్రతం చేయడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డ పై ప్రభావం పడుతుందని, గర్భిణీ స్త్రీలు పూజ అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.కానీ పిల్లలకు జన్మనిచ్చి 22 రోజుల వ్యవధి దాటని వారు మాత్రం ఈ వ్రతం ఆచరించకూడదని పండితులు చెబుతున్నారు.