మన జాతి పితగా పిలువబడే మహాత్మాగాంధీ దేశం కోసం ఎన్నో నిరాహారదీక్షలు,సత్యాగ్రహాలు చేశారు అని అందరికీ తెలిసిందే.అందుకే ఆయనను అందరూ కూడా జాతి పిత గా పిలుస్తారు.
అయితే ఆయన చేసిన నిరాహారదీక్ష,సత్యాగ్రహాలు అన్ని కూడా ఒక నాటకమేనట.ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ హెడ్గే.
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హెడ్గే మాట్లాడుతూ….గాంధీ చేసిన స్వాతంత్య్ర పోరాటం అంతా కూడా ఒక డ్రామా అని,అలాంటి వాళ్లను అసలు మహాత్మ అని ఎందుకు పిలవాలి అంటూ ప్రశ్నించారు.
అంతేకాకుండా గాంధీజీ నడిపిన స్వాతంత్ర్య ఉద్యమమంతా బ్రిటీష్ వాళ్ల అనుమతితో, వారి ప్రోద్బలంతోనే సాగింది.ప్రముఖులైన ఈ నాయకులెవరూ ఎప్పూడు ఒక్క లాఠీ దెబ్బ కూడా తినలేదు.
వాళ్ల స్వాతంత్ర్య ఉద్యమమంతా ఓ నాటకం అదంతా బ్రిటీష్ వాళ్లతో కుమ్మక్కయి నడిచిందే తప్ప అది నిజమైన పోరాటం కాదు.అదో సర్దుబాటు స్వాతంత్ర్య ఉద్యమం అంటూ హెడ్గే ఆరోపించారు.
ఆమరణ నిరాహార దీక్ష, సత్యాగ్రహం వల్ల భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటూ కాంగ్రెస్ మద్దతుదారులు చెబుతూ వస్తున్నారు.కానీ ఇది నిజం కాదు.సత్యాగ్రహం వల్ల బ్రిటీష్ వాళ్లు దేశాన్ని విడిచిపెట్టలేదు.వాళ్లకు విసుగుపుట్టి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు.
చరిత్ర చదివినప్పుడు నా రక్తం మరిగిపోతుంది.అలాంటి వాళ్లు మన దేశంలో మహాత్ములయ్యారు అంటూ హెడ్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర కన్నడ నుంచి హెడ్గే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రసంగిస్తూ ఇలా మహాత్మాగాంధీ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇలా బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు.
గతంలో కూడా పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నేతలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.అయితే ఇప్పుడు తాజాగా మాజీ కేంద్రమంత్రే ఇలాంటి దారుణ వ్యాఖ్యలు అందులోనూ జాతిపిత పై వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది.
మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.